జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తుదిదశకు చేరుకుంది. ప్రధాన రాజకీయపార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకోవడంతో హైదరాబాద్ నగరంలో రాజకీయవాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నగరంలోని ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ సభ ప్రారంభం కానుండగా, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ ఎన్నికలకు సంబంధించి సీఎం కేసీఆర్ పాల్గొంటున్న ఏకైక సభ ఇదే కావడంతో సీఎం ప్రసంగంపై రాజకీయవర్గాల్లో, ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి నెలకుంది. ముఖ్యంగా గంటపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రజలకు సందేశం ఇవ్వడమే కాకుండా, గత కొన్నిరోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా సీఎం కేసీఆర్ దీటైన సమాధానం ఇచ్చే అవకాశమున్నట్టు సమాచారం. అలాగే ఈ సభను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో అన్ని డివిజన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ సభకు రాష్ట్రమంత్రులు, జీహెచ్ఎంసీ పరిధిలోని టిఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ తరపున 150 డివిజన్లకు పోటీచేసే అభ్యర్థులు కూడా హాజరుకానున్నారు. సభకు హాజరయ్యే నాయకులకు, ప్రజలకు స్టేడియంవద్ద వేర్వేరుగా పలు మార్గాలు ఏర్పాటు చేశారు. అలాగే స్టేడియం లోపల మరియు వెలుపల ఎల్ఈడీ స్క్రీన్ లు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో స్టేడియం వద్ద లక్షల సంఖ్యలో మాస్కుల పంపిణీతో పాటుగా, శానిటైజర్లను అందుబాటులో ఉంచారు. మరోవైపు సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ