తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి ఎవరంటే?.. ఏ ఒక్క నాయకుడికీ క్లారిటీ లేదు. సర్వేల నివేదికలు అనుకూలతను బట్టి ఎమ్మెల్యేల నుంచి సీనియర్ల వరకు ఎవరికి వారే అంతా సీఎం కుర్చీపై కన్నేశారు. అంతేకాదు తానే కాబోయే సీఎం అంటే.. తానే కాబోయే సీఎం అని ఎవరికి వాళ్లే ప్రకటించుకుంటూ.. సీఎం అని పిలిపించుకోవాలని ఆశలు పెంచుకుంటున్నారు. ఇప్పటి వరకు సీనియర్ నేతలయిన జానారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీతక్క, దుద్దిళ్ల శ్రీధర్బాబు వంటి నేతలు కాంగ్రెస్ తరుపున కాబోయే ముఖ్యమంత్రి తామేనంటూ ప్రకటించేసుకున్నారు. తాజాగా ఈ లిస్టులోకి మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ చేరారు.
ఇలా సీఎం కుర్చీ కోసం కాంగ్రెస్ నేతల మాటలపై ఇప్పటికే మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. కాంగ్రెస్కు ముఖ్యమంత్రులు దొరికారు కానీ.. ఓటర్లు దొరకడం లేదని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్లో 11 మంది సీఎం కుర్చీ కోసం కొట్లాడుకుంటున్నారని.. అటు ఎన్నికల్లో పోటీ చేయని.. జానారెడ్డి కూడా సీఎం కుర్చీ కోసం పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
అయితే ప్రత్యర్థి పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ మధ్య కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కూడా .. సీఎం కుర్చీపై తన మనసులోని మాట బయటపెట్టారు. తనకు ముఖ్యమంత్రి కావాలని లేదన్న వెంకటరెడ్డి.. ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా ముఖ్యమంత్రిని అవుతానని వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ది అంతా తన హయాంలోనే జరిగిందని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని వెల్లడించారు.
ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ డిబేట్లో మధుయాష్కీ గౌడ్ తాను కూడా సీఎం అభ్యర్థినేనని ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారు కదా..ఇంతకీ మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని డిబేట్ నిర్వాహకురాలు ప్రశ్నించింది. ఎవరి పేరు చెబుతారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆమెకు.. వై నాట్ మీ అంటూ తిరిగి ఆమెకే షాక్ ఇచ్చారు. నేనెందుకు కాదు అంటూ మధుయాష్కి చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఉన్నవాళ్లు సరిపోరా ఇంకా తాను కూడా సీఎం రేస్లో ఉన్నట్టు ఎలా చెప్పారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
అయితే పార్టీని అధికారంలోకి తీసుకురావడం పక్కనపెట్టి.. సీఎం కుర్చీ కోసం నేతలు పోట్లాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలకు ముందే నేతలు సీఎం కుర్చీ కోసం ఇలా ఆశలు పెంచుకుంటే.. ఒకవేళ అధికారంలోకి వస్తే ఇంకా ఎలా ఉంటారోనని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. అధిష్టానం ఎవరికి సీఎం కుర్చీ కట్టబెడుతుందనేదానిపై ఫన్నీ మీమ్స్ కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE