రైతు భరోసా నిధులలో కేంద్ర వాటాను కూడా తన వాటాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రచారం చేసుకుంటున్నారని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తాజాగా విమర్శించారు. శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కేంద్రం విడుదల చేసిన రూ. 720 కోట్లలో ఎంతమేర పనులు చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే తరహా డిమాండ్లు.. సవాళ్లు తెలంగాణలో కూడా చాలా సార్లు వినిపించాయి. ఎన్నికల వినిపిస్తూనే ఉంటాయి కూడా.
తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలే తప్ప చేతల్లో చూపించలేదు. సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు నిధులు ప్రకటించడం ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడ సభ పెట్టినా.. కోట్లు.. కోట్లు ఇస్తా అని ప్రకటిస్తారు. కానీ ఇవ్వరు. హుజూర్ నగర్, సాగర్, దుబ్బాక, హుజూరాబాద్ సహా జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు అలాగే చెప్పారు కానీ పైసా ఇవ్వలేదు. కేంద్ర పథకాల నిధులను కూడా మళ్లించుకుంటూ సిగ్గు లేకుండా అబద్ధాలు ఆడుతున్నారు. గ్రామ పంచాయతీలకు ఎనిమిదేళ్లుగా కేంద్రం నుంచి వచ్చే నిధులు తప్ప కేసీఆర్ ఇచ్చిందేమీ లేదు.. అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ చాలా సార్లు ప్రస్తావించారు. కిషన్ రెడ్డి కూడా కేంద్ర, రాష్ట్ర నిధులపై అడపాదడపా మాట్లాడుతున్నా.. బండి హయాంలో ఈ ప్రస్తావన ఎక్కువగా వచ్చేది.
మరోవైపు.. బీఆర్ ఎస్ నేతలేమో.. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అన్నీ కేసీఆర్ చలవ వల్లే అని.., కేంద్రం స్పందించడం లేదని అంటుంటారు. మిషన్ కాకతీయ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్ర ప్రభుత్వం అమృత్ సరోవర్ పేరిట అమలు చేస్తున్న కార్యక్రమం విఫలమైందని, ఆ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం కారణంగా దేశంలో చెరువులు బాగవ్వడం లేదని ఓ సందర్శంలో ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కేంద్రం సపోర్టు లేకున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో రూ.వేల కోట్లు తీసుకొచ్చి చెన్నూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చె న్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ ఇటీవల పేర్కొన్నారు.
ఇదే తరహా చర్చ.. విమర్శనాస్త్రాల రచ్చ.. చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉన్నాయి. ఉంటాయి కూడా. కేంద్రమే ఇవ్వడం లేదంటూ రాష్ట్రం.. కేంద్ర ఇచ్చిన నిధులనూ తనదిగా చెప్పుకుంటున్నాయని కేంద్రం విమర్శలు చేసుకోవడం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఇచ్చే నిధుల విషయంపై చర్చకు మొదలైంది. కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వం నుంచి తగినంత ఆర్థిక సాయం రావడం లేదని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల నుంచి ఎక్కువగా విమర్ళలు వస్తున్నాయి. తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాలు కేంద్రం తక్కువగా నిధులు ఇస్తోందని పదేపదే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో తెలంగాణ గొంతు ఎక్కువగా వినిపిస్తుంది.
కేంద్రం ఏం చెబుతోందంటే.. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనలకు అనుగుణంగా రాష్ట్రాలకు నిధులు పంచుతున్నాం అంటోంది. ఈ ఆర్థిక సంఘం ప్రతిపాదనలు 2021-22 నుంచి 2025-26 వరకు అమల్లో ఉండనున్నాయి. ప్రస్తుతం మొత్తం పన్నుల ఆదాయంలో 41శాతం రాష్ట్రాలకు కేంద్రం పంచుతోంది. ఇందులోనూ కోతలు పెడుతోందని బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల విమర్శలు. ఏటా కేంద్రానికి జమ అయ్యే కార్పొరేషన్, వెల్త్ ట్యాక్సు, సెంట్రల్ జీఎస్టీ, కస్టమ్స్, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్సు కలిపి ట్యాక్స్ పూల్లో జమ అవుతాయి. ఇందులో 2023-24 సంవత్సరానికి రాష్ట్రాలకు పంచే రూ.10.21 లక్షల కోట్లుగా ఈ ఏడాది బడ్జెట్ లో అంచనా వేసింది. ఈ నిధులతో పాటు వివిధ ప్రాయోజిత పథకాలకు కేంద్రం నిధులు ఇస్తుంది. అయితే.. ఆ నిధులను కూడా తమవిగా ఆయా రాష్ట్రాలు ప్రచారం చేసుకుంటున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తంగా ఎక్కడ చూసినా నిధుల వాటాలపై లొల్లి కొనసాగుతూనే ఉంది. తాజాగా పురంధేశ్వరి జగన్ పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE