మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ పక్రియ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. మొత్తం 315 పోలింగ్ కేంద్రాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి, కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. కాగా ఉదయం 11 గంటల వరకు 34.33 % పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
దుబ్బాక పోరులో 23 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాత, బీజేపీ తరపున సీనియర్ నాయకుడు ఎం.రఘునందన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా పెద్దఎత్తున ప్రచారంలో నిర్వహించడంతో పాటుగా విమర్శలు, సవాళ్లుతో సాగడంతో ఈ ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకుంది. ఇక నవంబర్ 10 న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ