రవాణా శాఖలో కొత్త ప్రయోగాలకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ ప్రమాణాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వాహనదారులకు అన్ని రకాల సేవలు అందించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నారు. జూలై 24, శుక్రవారం నాడు మరో 5 రవాణా సేవలు ఆన్లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. పూర్తి సాంకేతిక పరిజ్ఞానంతో ఐటీ శాఖ సమన్వయంతో డూప్లికేట్ లెర్నింగ్ లైసెన్స్, డూప్లికేట్ లైసెన్స్ పొందడం, బ్యాడ్జి మంజూరు, స్మార్ట్ కార్డ్ పొందడం (పాత లైసెన్స్ సమర్పించి కొత్తది పొందడం), లైసెన్స్ హిస్టరీ షీట్ పొందడం వంటి సేవలను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సేవలను ఇక నుండి పూర్తిగా ఆన్లైన్ లోనే పొందవచ్చని పేర్కొన్నారు.
అక్రమాలకు అడ్డుకట్ట వేసి పారదర్శక పాలన అందించేందుకు ఇప్పటికే ఆధార్ను తప్పనిసరి చేశామని, అనేక సేవలను ఆన్లైన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు వినియోగించుకుంటున్నారని మంత్రి పువ్వాడ అన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ పదే పదే తిరగనవసరం లేదు. మధ్యవర్తులు, దళారులను ఆశ్రయించాల్సిన అవసరం అసలే ఉండదు. ఈ నూతన విధానం ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ఆన్లైన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రజల వెసులుబాటు కోసం శాఖలో మరిన్ని సేవలు మరింత తేలికపాటిగా పొందేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
తాజాగా ప్రతిపాదించిన నూతన విధానంతో రవాణా శాఖ మరో అడుగు ముందుకేసి ఈ 5 సేవలు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. దరఖాస్తుదారుడు ఇంట్లోనే కంప్యూటర్ ముందు కూర్చొని వాహన్ వెబ్సైట్ ఓపెన్ చేసి తనకు కావలసిన సేవలను దరఖాస్తు చేసుకోవచ్చుని, దరఖాస్తుదారుడు తన వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించాలంటే దానికి సంబంధించిన అన్ని పత్రాలను ఆన్లైన్లో పంపాల్సి ఉంటుందన్నారు. రవాణా శాఖలో వస్తున్న సంస్కరణలకు అనుగుణంగా ప్రజలు సేవలను వినియోగించుకోవాలని మంత్రి కోరారు. నూతనంగా అమల్లోకి వచ్చిన ఆన్లైన్ విధానం ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరమని, మధ్యవర్తులను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా కావాల్సిన సేవలను పొందాలని మంత్రి పువ్వాడ అజయ్ కోరారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu