టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటిఆర్ తన పుట్టినరోజు సందర్భంగా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడానికి ఉపయోగపడేలా తనవంతుగా పార్టీ తరపున ఆరు అంబులెన్స్లను ప్రభుత్వ ఆస్పత్రులకు అందిస్తానని ప్రకటించారు. తనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రగతి భవన్ కి వచ్చిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో మాట్లాడుతూ, కరోనా టెస్టులు చేసేందుకు వీలుండేలా మరియు ఇతర అన్ని సదుపాయాలతో కూడిన ఆరు అంబులెన్స్ లు కొనుగోలు చేసి పార్టీ తరపున ప్రభుత్వానికి అందిస్తానని, వాటిని గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించుకోవాలని మంత్రి కేటిఆర్ చెప్పారు.
అనంతరం మంత్రి కేటిఆర్ నిర్ణయాన్ని పలువురు మంత్రులు, నాయకులు అభినందిస్తూ, తాము సైతం తమవంతుగా పార్టీ తరపున ప్రభుత్వానికి అంబులెన్స్ లు అందిస్తామని ముందుకు వచ్చారు. మంత్రి ఈటల రాజేందర్ కరీనంగర్ జిల్లా పార్టీ తరఫున 5 అంబులెన్స్లను సమకూరుస్తానని చెప్పారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర జిల్లా నేతలతో కలిసి వరంగల్ జిల్లా తరఫున 6 అంబులెన్స్లను అందిస్తామన్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా తరపున 6 అంబులెన్స్ లు అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి పాలమూరు జిల్లా పార్టీ తరఫున 11 అంబులెన్స్లను, అటవీ శాఖ, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నాలుగు అంబులెన్స్ లను సమకూరుస్తామని చెప్పారు. ఇలా పలువురు మంత్రులు, కీలక నాయకులు స్పందించడంతో హైదరాబాద్ మినహా మిగతా 32 జిల్లాలలో మొత్తం 100 కొత్త అంబులెన్స్ లు కొనుగోలుకు రంగం సిద్ధమైంది. అనంతరం మంత్రి కేటిఆర్ స్పందిస్తూ ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో కొత్త అంబులెన్సులు సమకూరితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పారు. అంబులెన్స్ లు అందించడానికి ముందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu