తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టికెట్ కోసం నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది. ప్రధాన పార్టీల్లో ఒక్కో టికెట్ కోసం వంద మంది వరకు పోటీ పడుతున్నారు. అదే సమయంలో టికెట్ దక్కని నేతలంతా అసంతృప్తితో.. ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. దాదాపు అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. ఇటీవల తనకు టికెట్ ఇచ్చి.. తన కొడుక్కి ఇవ్వకపోవడంతో మైనంపల్లి హన్మంత రావు గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్లో చేరారు. ఇలా తండ్రీ కొడుకులు ఇద్దరూ ఎన్నికల్లో పోటీ చేస్తే.. ఒకరికి ఒకరు సపోర్ట్ చేసుకుంటుంటారు. కానీ ఒక్క టికెట్ కోసం మాత్రం తండ్రీ కొడుకులు ఇద్దరూ పోట్లాడుకుంటున్నారు.
బీజేపీ నుంచి ఆందోల్ టికెట్ కోసం సినీ నటుడు మోహన్ బాబు పోటీ పడుతుంటే.. అదే టికెట్ను ఆయన కుమారుడు ఉదయ్ కూడా ఆశిస్తున్నాడట. ఆ సీటు తనకే కేటాయించాలని మోహన్ బాబు కోరుతుండగా.. లేదు తనకే ఇవ్వాలని అతని కొడుకు అధిష్టానం వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారట. ఎలాగైన ఆ టికెట్ దక్కించుకునేందుకు ఉదయ్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారట.
అయితే 1998లో టీడీపీ తరుపున ఆందోల్ నుంచి మోహన్ బాబు పోటీ చేసి గెలుపొందారు. ఓసారి కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డాక మోహన్ బాబు బీఆర్ఎస్లో చేరారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరుపున ఆందోల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకు కాషాయపు కండువా కప్పుకున్నారు. అయితే ఈ సారి బీజేపీ తరుపున ఆందోల్ నుంచి బరిలోకి దిగేందుకు మోహన్ బాబు రెడీ అవుతున్నారు. కానీ ఆయన సొంత కొడుకే అతనికి షాక్ ఇస్తున్నారు.
అయితే అటు బీజేపీ అధిష్టానం కూడా మోహన్ బాబును కాదని.. ఉదయ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి బీసీలకు, యువకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీజేపీ చెప్పుకొస్తోంది. ఈక్రమంలో ఉదయ్.. యువకుడు, పైగా విద్యావంతుడు కూడా కావడంతో ఆయన పేరును అధిష్టానం పరిశీలిస్తోందట. ఎక్కువగా ఉదయ్ వైపే పవనాలు వీస్తున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మరి అధిష్టానం టికెట్ తండ్రికి ఇస్తుందా? కొడుక్కి కట్టబెడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ