42వ జీఎస్టీ కౌన్సిల్ భేటీ సోమవారం నాడు జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలి. పరిహారం పోందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు అని అన్నారు. జీఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్-1, ఆప్షన్-2 ఏవీ తెలంగాణకు సమ్మతం కాదని చెప్పారు. జీఎస్టీ చట్ట ప్రకారం రాష్టానికి హక్కుగా రావాల్సిన పరిహారం కేంద్రమే అప్పు తీసుకుని చెల్లించాలని అన్నారు.
“ఇప్పటికే సెస్ రూపంలో కౌన్సిల్కు జమ అయిన 30 వేల కోట్లు వెంటనే రాష్ట్రాలకు విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే మూడు ఇన్స్టాల్ మెంట్స్ గత ఆరు మాసాల నుండి పెండింగ్ లోఉన్నాయి. కోవిడ్ పరిస్థితుల్లో ఈ మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరం. ఆత్మనిర్భర్ ప్యాకేజీ కింద రాష్ట్రాలకు ఇచ్చిన రుణ పరిమితికి జీఎస్టీ పరిహార చెల్లింపులకు ముడి పెట్టవద్దు. ఐజీఎస్టీ కింద రాష్ట్రాలకు రావాల్సిన మొత్తాన్ని వెంటనే చెల్లించాలి. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఐజీఎస్టీ 24 వేల కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్లో జమ చేశారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి 2638 కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలి” అని మంత్రి హరీశ్ రావు కోరారు.
కాగా వారం రోజుల్లో ఐజీఎస్టీ మొత్తం 24 వేలకోట్లు రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించినట్టు తెలిపారు. అదే విధంగా రివర్స్డ్ అండ్ ల్ఫాప్స్డ్ ఐజీఎస్టీ ఐటీసీ కూడా రాష్ట్రాలకు కొద్దికాలంగా ఇవ్వడంలేదు. ఇందులో తెలంగాణ కు రావాల్సిన వేయి కోట్లు వెంటనే విడుదల చేయాలని మంత్రి కోరారు. తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆప్షన్లకు అంగీకరించకుండా జీఎస్టీ పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని డిమాండ్ చేయడంతో జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం చేయకుండానే వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. మరోవైపు మరింత సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించేందుకు అక్టోబర్ 12 తేదీన మరో మారు సమావేశం కావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu