నాటకీయ పరిణామాల మధ్య తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపికయిన విషయం తెలిసిందే. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం సాయంత్రం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. డిసెంబర్ 7న తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ నెల 3న వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజార్టీ లభించింది. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొందగా.. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, ఒక స్థానంలో సీపీఐ గెలుపొందాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు 60 సీట్లు కావాల్సి ఉండగా.. కాంగ్రెస్ 64 స్థానాల్లో గెలుపొందింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం అయింది.
దీంతో కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ నేతలంతా ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతోనే పనయిపోలేదని.. ముందుంది మొసళ్ల పండగ అంటూ రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలి. తమ పార్టీ ఇచ్చిన హామీలు అమలుకు.. దాదాపు వంద రోజుల సమయం పడుతుందని ఈ పార్టీ సీనియర్ లీడర్లు కొంతమంది చెబుతున్నారు. కానీ హస్తం పార్టీ వంద రోజుల సమయం తీసుకున్నా కూడా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయగలుగుతుందా..అంటే ఇంపాజబుల్ అనే మాటే ఎక్కువగా వినిపిస్తుంది.
ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వ ఖజానా చూస్తే అంత ఆశాజనకంగా లేదన్న విషయం తెలిసిందే. ఇచ్చినవి ఆరు హామీలే అని అవి అమల్లో పెట్టడానికి మాత్రం వేల కోట్లు ఖర్చవుతాయన్న లెక్కలు ఇప్పుడు ఆ నేతల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తాయనడంలో సందేహం లేదు. ముందుగా ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, వాటిని తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదిస్తామని చెప్పి.. మరీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. హామీలకు తాము గ్యారంటీ అని చెప్పి ఆ పార్టీ నేతలు ప్రజల నుంచి ఓట్లు సంపాదించుకున్నారు
నిరుద్యోగుల విషయానికి వస్తే వీరికి వీలయినంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేయాలి. లేకపోతే వీరంతా మళ్లీ ఉద్యమ బాట పట్టే అవకాశముంది. అలాగే కాంగ్రెస్ చెబుతున్న ఆ జాబ్ కేలండర్ను, జాబ్ కేలండర్ పేరుతో వచ్చిన ప్రకటనలను పరిశీలిస్తే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ ప్రకటనలో పేర్కొంది. అసలు రాష్ట్రంలో ప్రస్తుతం అన్ని ఖాళీలు ఉన్నాయా, ఏయే విభాగాల్లో ఎన్ని ఉన్నాయి.. అనే అంశాలను పరిశీలించకుండానే.. అధికారంలో కూడా లేని కాంగ్రెస్ అంత బహిరంగంగా నోటిఫికేషన్ ఎలా జారీ చేసిందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
మరవైపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్, రైతులకు, కౌలు రైతులకు రైతు భరోసా, 200 యూనిట్ల వరకూ విద్యుత్తు ఛార్జీల మినహాయింపు వంటి భారీ హామీలు హస్తం పార్టీ ముందున్న పెద్ద సవాళ్లు. ఈ హామీలన్నీ కూడా ఖజానాపై భారీ ఎత్తున భారం మోపేవే. వీటిలో ఏ ఒక్క హామీలో కాంగ్రెస్ వెనకడుగు వేసినా ఆదిలోనే నవ్వుల పాలవడం ఖాయం. అందుకే ఆర్థిక మంత్రితో పాటు అధికారులు కూడా ఈ హామీలపై పూర్తి స్థాయి కసరత్తులు చేయాల్సి ఉంటుంది. అధికారంలోకి వస్తే వస్తామన్న.. వస్తే అప్పుడు చూసుకుందాంలే అన్నట్లుగానే ఈ హామీలున్నాయి తప్ప అమలు చేసే హామీలు కావని అప్పట్లో అధికారపార్టీ నేతలన్న మాటలే ఇప్పుడు నిజమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి.
అలాగే మరో విషయంపైన కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ట్యాక్సులు పెంచితే మాత్రం ఈ ప్రభుత్వంపైన కూడా విమర్శలు తలెత్తే అవకాశాలు బాగా ఉంటాయి. కర్ణాటకలో 2 వందల యూనిట్ల ఉచిత విద్యుత్తును ఇవ్వడానికి.. మిగిలిన వాళ్లపై విద్యుత్తు చార్జీలపై పెంపు భారాన్ని మోపారు. అలాగే కర్ణాటకలో లాగే ఇక్కడ కూడా.. మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి బస్సు ఛార్జీలను కూడా పెంచే అవకాశాలున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే కనుక ఇక్కడా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు.
ఈ 6 హామీలతో పాటు .. ఆర్థిక భారం పడే చాలా హామీలు కాంగ్రెస్కు తొలి ఆరు నెలల్లోనే పెద్ద సవాళ్లుగా మారనున్నాయి. వీటన్నిటినీ అమలు చేయడానికి ఎక్కడి నుంచి నిధులు తెస్తారు? ఇతర ఆదాయ మార్గాలను అన్వేషిస్తారా? లేక అప్పులు మీద ఆధారపడతారా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనికి తోడు కాంగ్రెస్ అంటే ఆమడ దూరంలో ఉండే బీజేపీ కేంద్రంలో ఉంది కాబట్టి.. నిధుల మంజూరు విషయంలో కాస్త ఇబ్బందులు పెట్టొచ్చు. ఈ 6 నెలల్లో ఇచ్చిన కొన్ని హామీలయినా అమలు కాకపోతే.. ఆ ప్రభావం లోక్సభ ఎన్నికలపై కచ్చితంగా చూపిస్తుంది. మరి ఈ గండాలను హస్తం పార్టీ ఎలా గట్టుక్కుతుందో వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY