తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో ప్రజలకు చేరువయ్యే ప్రణాళికలో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో హాథ్ సే హాథ్ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పాదయాత్ర సోమవారం మేడారం నుంచి మొదలవగా ప్రస్తుతం ములుగు జిల్లాలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రెండో రోజు ములుగు జిల్లాలో 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన రేవంత్ రెడ్డి.. ప్రజలు, రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం ములుగులో కార్నర్ మీటింగ్లో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్ను నక్సలైట్లు పేల్చేయాలని అన్నారు. పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే ఏంటి? లేకుంటే ఏంటి? అని వ్యాఖ్యానించారు. గతంలో దొరల గడీలను పేల్చేసిన నక్సలైట్లు నేడు ప్రగతి భవన్ను గ్రనేడ్లతో పేల్చేసినా ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక ప్రగతి భవన్ను పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అధికార బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. బుధవారం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని బీఆర్ఎస్ నేతలు పోలీసులను డిమాండ్ చేశారు. ఇక అంతకుముందు ఈరోజు ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్రలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఒక పార్టీకి రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా బాధ్యత లేకుండా మాట్లాడటమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ వ్యాఖ్యలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిలు సమర్థిస్తారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై డీజీపీని కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ వదిలేసిందా? పక్కనే ఉన్న ఛత్తీస్ఘడ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, అక్కడి ప్రభుత్వ ఆఫీస్లను కూడా పేల్చాలని కోరగలరా? రేవంత్ మాదిరే ఇతర రాష్ట్రాల పీసీసీ చీఫ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అని నిలదీశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE