తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శనివారం ఉదయం హైదరాబాద్ లోని పంజాగుట్టలో గల నిమ్స్ ఆసుపత్రిలో దాదాపు రూ.2 కోట్లతో సమకూర్చుకున్న ఇంట్రా ఆపరేటివ్ ఆల్ట్రా సౌండ్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్, ఆల్ట్రా సోనిక్ ఆస్పిరేట్ వైద్య పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, నిమ్స్ లో ఈ అత్యాధునిక వైద్య పరికరాలను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. మారుతున్న సాంకేతికత అందిపుచ్చుకునేలా వస్క్యులర్ సర్జరీ సింపోసియం నిర్వహించడం గొప్ప విషయమనన్నారు. వైద్యులు నిత్య విద్యార్థులని, రోజురోజుకి ఎంతో సాంకేతికత పెరుగుతున్నదన్నారు. ప్రముఖ కిడ్నీ స్పెషలిస్టు డా.దామోదర్ రెడ్డి కుంబాల మంచి హృదయంతో వచ్చి ఇక్కడ నైపుణ్యాలు పెంచుతున్నారని పేర్కొన్నారు.
ఇక డయాలసిస్ సేవలు అందించడంలో తెలంగాణ ఛాంపియన్ అని మంత్రి హరీశ్ రావు తెలిపారు. “తమిళనాడు సీఎం స్టాలిన్ తెలంగాణ మోడల్ అడాప్ట్ చేస్తున్నాం అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 3 డయాలిసిస్ కేంద్రాలు ఉండగా, ఇప్పుడు 102 కి పెంచుకున్నాం. డయాలిసిస్ మీద తెలంగాణ ప్రభుత్వం ఏటా వంద కోట్లు ఖర్చు చేస్తుంది. డయాలసిస్ వారికి బస్ పాస్, పింఛన్లు, జీవిత కాల మందులు ఉచితంగా అందిస్తున్నాం. డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం కొండంత అండ ఇస్తున్నది. తెలంగాణలో 50 లక్షల డయాలసిస్ సెషన్స్ పూర్తి చేశాం. రోగం రాకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. అలాగే తెలంగాణ ప్రభుత్వం సురక్షిత మంచి నీరు అందిస్తున్నది. ప్రతి ఇంటికి ఉపరితల మంచి నీరు వంద శాతం అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ” అని అన్నారు.
“ప్రజల్లో ఎక్కువ బీపీ, షుగర్ వస్తున్నాయి. ప్రభుత్వం ప్రాథమిక దశలో గుర్తించి మందులు ఇస్తుంది. ఎన్సీడీ స్క్రీనింగ్ చేస్తున్నాం. మందులు ఇస్తున్నాం. పెద్దవారికి అర్ధం అయ్యేలా వివిధ రంగుల మూడు పౌచుల్లో మందులు పెట్టీ అందిస్తున్నాము. పేదలకు అత్యున్నత వైద్యం నేడు తెలంగాణలో అరోగ్య శ్రీలో అందుతున్నది. నిమ్స్ ఆసుపత్రి వైద్యులు బాగా పని చేస్తున్నారు. ఇక్కడ నెఫ్రాలజీ పనితీరు అద్బుతం. కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ అత్యధికంగా నిమ్స్ లో జరుగుతున్నాయి. జీవన్ దాన్ అవయవ దానం వెయిటింగ్ లిస్ట్ ఎక్కువగా ఉంది. అందరం కలిసి అవయవదానం ప్రోత్సహించాలి. ఇక్కడ ఐసీయూ పడకలు డబుల్ చేసుకున్నాము. గత ఏడాది వచ్చిన సమయంలో ఎక్విప్మెంట్ కోసం 150 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రొఫెసర్ సహా ఇతర అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. నిమ్స్ ని మరింత బలోపేతం చేస్తాము. వైద్య సిబ్బంది ఓనర్ షిప్ తో పని చేయాలి. పేదలకు మంచి వైద్యం అందించాలి” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE