నవంబర్ 11, సోమవారం నాడు ఎంఎంటీఎస్ రైలు కాచిగూడ స్టేషన్ లో ఆగి ఉన్న కర్నూలు-హైదరాబాద్ హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్ రైలును డీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి కాచిగూడ స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో ఉన్నత స్థాయి కమిటీ విచారణ ప్రారంభించింది. రైల్వే సేఫ్టీ కమిషనర్ రామ్కృపాల్ నేతృత్వంలో ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 3:30 వరకు ఈ విచారణ జరిగింది. నేడు విచారణలో భాగంగా కాచిగూడ స్టేషన్ మేనేజర్, డివిజన్ రీజనల్ మేనేజర్, అడిషనల్ డివిజన్ రీజనల్ మేనేజర్ లు రైల్వే సేఫ్టీ కమిషనర్ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రత్యక్ష సాక్షులను, స్థానికులను, ప్రమాద సమయంలో స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్నవారిని కూడ విచారించారు. విచారణ ప్రక్రియ పూర్తయ్యాక రైల్వే సేఫ్టీ కమీషనర్, ఇతర అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని ప్రమాదస్థలాన్ని, ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. నవంబర్ 14, 15వ తేదీల్లో హైదరాబాద్ రైల్భవన్లో ఈ కమిటీ మరోసారి సమావేశమై ప్రమాద ఘటనపై అధికారులను విచారించనున్నారు. రైలు ప్రమాదానికి సాంకేతిక లోపం కారణమా, మానవ తప్పిదం వల్ల జరిగిందా విషయాలను నిర్ధారించుకున్న అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
[subscribe]