జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నవంబర్ 13, బుధవారం నాడు విజయవాడ లోని విశాలాంధ్ర మరియు ఎమెస్కో పుస్తక విక్రయ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిందని, రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో విద్యను బోధించే విధానాన్ని తీసుకురావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. గ్లోబలీకరణ వలన ఇంగ్లీష్ చాలా అవసరంగా మారింది. అయితే ఇంగ్లీష్ మాధ్యమం నేపథ్యంలో మన సంస్కృతి మూలాలను, భాషను చంపేసుకోవడమంటే మన ఉనికిని చంపేసుకోవడమే అన్నారు.
మాతృభాషైన తెలుగు పరిరక్షణ కోసం ఉపాధ్యాయులు, సాహితీవేత్తలు బయటకు రావాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తమిళ భాషపై ఎవరైనా చిన్న మాట అన్నా ఆ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒక్కటైయ్యారని, దురదుష్టవశాత్తు మన రాజకీయ నాయకులకు తెలుగు భాషపై ప్రేమ లేదని విమర్శించారు. తెలుగు భాషను గాని, తెలుగు సంస్కృతి ఉనికిని గాని చంపేసే ప్రయత్నాలు ఎవరూ చేసిన మట్టిలో కలిసిపోతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు మాద్యమంలో చదవాలనే ఆసక్తి ఉన్నా విద్యార్థి ఊరికి ఒక్కరున్నా, ఆ పాఠశాలలో తెలుగు మాధ్యమాన్ని ఆపకుండా బోధించాల్సిందేనని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.
[subscribe]