హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. హిమాచల్ ప్రదేశ్ లో నేడు ఒకే విడతలో 68 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. శనివారం ఉదయం 8 గంటలకే పోలింగ్ ప్రారంభం అవ్వగా, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. సాయంత్రం 5:30 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కాగా ఈ ఎన్నికల్లో మొత్తం 55,74,793 ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ పక్రియ కోసం మొత్తం 7,881 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 17.98 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఎన్నికల విధుల్లో దాదాపు 50,000 మంది పోలింగ్ సిబ్బంది మరియు 25,000 మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు.
బీజేపీ నేత, హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్, మాజీ సీఎం ప్రేమ్ కుమార్ ధుమాల్, ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు, ఎమ్మెల్యే విక్రమాదిత్య సింగ్, కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ సహా పలువురు ప్రముఖులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం జై రామ్ ఠాకూర్ పోటీచేస్తున్న సెరాజ్ మరియు హరోలి, మండి, సిమ్లా రూరల్, హమీర్పూర్ నియోజకవర్గాల్లో కీలక పోరు జరగనున్నట్టు తెలుస్తుంది.
ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “హిమాచల్ ప్రదేశ్లోని అన్ని అసెంబ్లీ స్థానాలకు ఈరోజు పోలింగ్ రోజు. ఈ ప్రజాస్వామ్య పండుగలో దేవభూమి ఓటర్లందరూ పూర్తి ఉత్సాహంతో పాల్గొని ఓటింగ్లో కొత్త రికార్డు సృష్టించాలని అభ్యర్థిస్తున్నాను. ఈ సందర్భంగా తొలిసారి ఓటు వేస్తున్న రాష్ట్ర యువతకు నా ప్రత్యేక శుభాకాంక్షలు” అని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ, “హిమాచల్ ఓపీఎస్కు ఓటేస్తుంది. హిమాచల్ ఉపాధి కోసం ఓటు వేస్తుంది. హిమాచల్ ‘హర్ ఘర్ లక్ష్మి’కి ఓటు వేయనుంది. రండి, పెద్ద సంఖ్యలో ఓటు వేయండి మరియు హిమాచల్ ప్రదేశ్ యొక్క పురోగతి మరియు సంపన్న భవిష్యత్తు కోసం మీ విలువైన సహకారం అందించండి” అని ప్రజలనుద్దేశించి పేర్కొన్నారు.
హిమాచల్ ప్రదేశ్ లో ముఖ్యంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్యనే కీలక పోటీ నెలకుంది. ఈ మూడు పార్టీలు మొత్తం 68 స్థానాల్లో పోటీ చేస్తుండగా, సీపీఎం 11, సీపీఐ 1, బీఎస్పీ 53, ఆర్డీపీ 29 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. గత 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 44, కాంగ్రెస్ 21, ఇండిపెండెంట్స్ 2, సీపీఎం ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. తాజా అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, ఆప్ విస్తృత ప్రచారం నిర్వహించాయి. మొత్తం 68 స్థానాలకు గానూ అన్ని పార్టీల నుంచి 412 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక హిమాచల్ ప్రదేశ్ లో డిసెంబర్ 8న ఓట్ల లెక్కింపు పక్రియ నిర్వహించి, ఫలితాలను వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE