తెలంగాణలో దేశంలో ఎక్కడా లేని పథకాలను అమలు చేస్తున్నామని పదేపదే నేతలు చెప్పుకుంటున్నా.. వాటి ఫలాలను అందుకుంటున్న వాళ్లు మాత్రం ఈ సారి బీఆర్ఎస్ వైపు నిలవడం లేదనే వాదన వినిపిస్తోంది. నిజానికి రాష్ట్రమంతా దాదాపు కోటిమంది లబ్ధిదారులున్నారు అయినా కూడా అనుకున్నంత స్థాయిలో ఆదరణ లభించడం లేదని సర్వేల లెక్కలు తేలుస్తున్నాయి. అదే నిజం అన్నట్లుగా ప్రచార సమయంలో అడుగడుగునా నిరసనలు ఎదురవుతుండటంతో.. ప్రచారానికి ఇంకో రెండు వారాలే సమయం ఉండడంతో వీరి అసంతృప్తిన పోగొట్టి ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలా అని తర్జనభర్జనలు పడుతున్నారు.
ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్.. 18 రోజుల పాటు దాదాపు 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన మొదటి విడత ప్రచారాన్ని పూర్తి చేశారు. అయినా సరే గతంలో ఉన్నట్లుగా అంతగా అనుకూల పవనాలు కనిపించలేదని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పదేళ్ల పాలన, సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఆదుకుంటుందని భావించినా.. ఈ సారి ఆ లెక్కలు తప్పుతాయా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలే ఎక్కువమంది ఉండటమే దీనికి ప్రధాన కారణమా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో కనిపించిన ఆదరణ ఈ సారి లేకపోవడం, గ్రామాల్లో సమస్యలపై అభ్యర్థులను నిలదీయడం వంటివి బీఆర్ఎస్ నేతలకు మింగుడు పడటం లేదు.
దేశంలో ఏ రాష్ట్రంలో లేనన్ని పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నా కూడా ఓటర్లు ఇలా వ్యతిరేకంగా తయారవడంపై మల్లగుల్లాలు పడుతున్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ద్వారా లబ్ధిని పొందుతున్నా కూడా తమ పార్టీకి ఓటర్లు ఎందుకు దూరమవుతున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ప్రజల నుంచి ఈ సారి ఎన్నికల ముందు ఇలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుండటం అభ్యర్థులకు మింగుడుపడడంలేదు.
రైతుబీమా,రైతుబంధు, దళితబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, గృహలక్ష్మి, చేతి వృత్తులకు చేయూత వంటి ఎన్నో పథకాలను కేసీఆర్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. వీటితో చాలామంది లబ్దిదారులు.. లబ్ధి పొందుతున్నా కూడా ప్రచారానికి వెళ్లినప్పుడు అభ్యర్థులను నిలదీస్తుండటం, ప్రచారానికి రావొద్దంటూ ఓపెన్గా ఫ్లెక్సీ బ్యానర్లు కట్టడం వంటివి బీఆర్ఎస్ నేతలను అయోమయంలో పడేస్తున్నాయి.
ఓటర్ల నుంచి ఇంతగా వ్యతిరేకత రావడానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలే అన్న వాదన వినిపిస్తోంది. ఈ సారి టికెట్లు ఇచ్చినప్పుడు సిట్టింగ్ లపై ఇప్పటికే జనాగ్రహం ఉందని తెలిసినా అసంతృప్తులు పెరిగిపోతారన్న లెక్కలతో కేసీఆర్ మళ్లీ వారికే టికెట్ ఇచ్చారు. అయితే కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయమే బీఆర్ఎస్ పార్టీని కొంపలు ముంచేలా చేస్తుందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు.
వారిపై విపరీతమైన నెగిటివిటీ ఏర్పడటం.. ఎన్నికల సమయంలో తప్ప మిగిలిన సమయాల్లో అందుబాటులో ఉండరన్న అపవాదును మూట కట్టుకోవడం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు అని చెప్పుకుని తమ ఆస్తులు పెంచుకోవడం తప్ప ఆయా నియోజకవర్గాలకు చేసిందేమీ లేకపోవడంతో వారిని ప్రజలు నమ్మడం మానేసారు. ఇదేసమయంలో మరోసారి వారికే టికెట్ కేటాయించడంపై మరింత అసంతృప్తి చెలరేగింది.
అయితే రాజకీయాల్లో రాత్రికి రాత్రే ఏమయినా జరగొచ్చన్న నానుడి ఉంటుంది కాబట్టి.. ఎన్నికలకు ఇప్పుడున్న ఈ సమయాన్నే తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అభ్యర్థులు రెడీ అవుతున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఎలా అయినా మూడోసారి అధికారాన్ని పొంది హ్యాట్రిక్ సాధించామన్న రికార్డును సొంతం చేసుకోవాలని బలంగా అనుకుంటున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE