తెలంగాణలో ఎన్నికల వేడి చివరి దిశకు వచ్చేస్తోంది.మరో రెండు వారాల్లో ప్రచారానికి తెరపడటం.. నవంబర్ 30న ఎన్నికలు జరగడం.. డిసెంబర్ 3న అభ్యర్థుల జాతకాలు తేలిపోతాయి. పొత్తుల లెక్కలు తేలిపోవడంతో అన్ని పార్టీలు తమ ప్రచారపు హోరును పెంచారు.అయితే ఇప్పటికీ వామపక్షాల దారులు మాత్రం అందరినీ ఆశ్చర్యంలో పడేస్తున్నాయి.
నిజానికి పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలైన సీపీఐ, సీపీఎంలు కలిసి ఉండాలని ఎప్పటి నుంచో అనుకున్నాయి. ఈ ఎన్నికలలో ఆ రెండు పార్టీలు బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని అనుకున్నా.. సీఎం నిర్ణయంతో అది సాధ్యం కాలేదు. ఆ తర్వాత కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడానికి జరిగిన ఎన్నో చర్చలలో చివరకు సీట్ల సర్దుబాటులో సీపీఐ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది. కానీ, ఖమ్మం నుంచి ఒక్క సీటైనా కచ్చితంగా ఇవ్వాల్సిందేనని సీపీఐ పట్టుబట్టగా.. అది కుదరకపోవడంతో పొత్తు పొడవలేదు. దీంతో ఈ రెండు పార్టీల మధ్య ప్రాథమిక అవగాహనకు అడ్డు తగిలినట్లు అయింది.
కాంగ్రెస్ పొత్తు చర్చల నుంచి విరమించుకున్నట్టు అప్పుడు సీపీఎం ప్రకటించి.. కొన్ని కీలక స్పష్టతలు ఇచ్చింది. 19 స్థానాల్లో పోటీ చేస్తున్నామని.. తాము ప్రజానుకూల పాలనకు మాత్రమే మద్దతు ఇస్తామని సీపీఎం తెలిపింది. అంతేకాదు సీపీఐ అభ్యర్థి ఉన్న చోట తాము బరిలోకి దిగబోమని, ఆ పార్టీకే మద్దతు ఇస్తామని సీపీఎం స్పష్టం చేసింది. అంతేకాదు తమ ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అని, ఆ పార్టీని అధికారంలోకి రానివ్వకుండా తాము అడ్డుకుంటామని చెప్పుకొచ్చింది. దీనికి తగినట్లే సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్న కొత్తగూడెం నుంచి సీపీఎం పార్టీ బరిలోకి దిగకుండా ఆయనకు పరోక్షంగా మద్దతు ఇస్తుంది.
మరోవైపు సీపీఐ మాత్రం దీనికి భిన్నమైన పంథాను ఎంచుకుంది. ఎలా అంటే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పోటీ చేస్తున్న చోట.. సీపీఎం అభ్యర్థిని బరిలోకి దించలేదు. కానీ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీకి దిగుతున్న పాలేరులో మాత్రం సీపీఐ.. సీపీఎం పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. పొత్తు ధర్మంలో భాగంగా.. కాంగ్రెస్కే మద్దతు ఇస్తోంది. పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బరిలో నిలుస్తున్నారు.దీంతో సీపీఎంను కాదని.. పొంగులేటికే తమ మద్దతు అంటోంది సీపీఐ.
తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతుగా కూడా మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసిపోయాయని..అందుకే నామినేషన్ వేసిన రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు జరిగాయని గుర్తు చేశారు. దీంతో మిగిలిన పార్టీలన్నీ పొత్తులతో ఓ కొలుక్కి వస్తే.. ఈ రెండు నాల్కల ధోరణి ఏంటని తెలంగాణ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ సీపీఐ,సీపీఎం ప్రత్యర్థులా? మిత్రపక్షాలా? అని అనుమానాలను లేవనెత్తుతున్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో పాలేరు సీటులో సీపీఎం, సీపీఐ ఓట్ల మధ్య చీలికలు వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. ఓ వైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పోటీలో ఉండగా.. సీపీఐ నేతలు మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి మద్దతు ఇస్తున్నారు. దీంతో వామపక్షాల ఓటు బ్యాంకులో గందరగోళం ఏర్పడి ఓటర్లు రెండు చీలిపోయి..కాంగ్రెస్కు కొందరు, సీపీఎంకు కొందరు ఓట్లు వేసే పరిస్థితి ఏర్పడింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE