వరంగల్ రూరల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, ఈ రోజు బతుకమ్మ చీరలను అందుకుంటున్న తెలంగాణ, నియోజకవర్గ ఆడబిడ్డలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వమే ప్రజల పండుగలని నిర్వహిస్తున్నదని చెప్పారు. పరిపాలనను, వ్యవసాయం వంటి అన్ని రంగాలను అభివృద్ధి-సంక్షేమ పథకాలతో తెలంగాణనే సీఎం కేసీఆర్ పండుగలా చేశారని అన్నారు. రంజాన్ కానీ, క్రిస్మస్ కానీ, బతుకమ్మ పండుగ కానీ, ప్రభుత్వమే ప్రజలకు బట్టలు పెట్టి పండుగని చేయడం చరిత్రలో ఎక్కడా లేదని అన్నారు.
రాష్ట్రంలో 1 కోటి 2 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు:
2017లో బతుకమ్మ పండుగని రాష్ట్ర పండుగగా సీఎం కేసీఆర్ ప్రకటించినారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. “దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న, 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు చీరలు పంపిణీ చేస్తున్నాం. తెలంగాణలోని ఆడపడచులకు సారెగా, చీరను బహుమతిగా సీఎం కేసీఆర్ ఇస్తున్నారు. ప్రతి ఏడాది రాష్ట్రంలో 1 కోటి 2 లక్షల మంది మహిళలకు చీరలు అందిస్తున్నాం. రాష్ట్రంలో 20లక్షల, 36వేల, 234 కుటుంబాలకు ఈ చీరలు అందుతున్నాయి. గత ఏడాది 313 కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది 317 కోట్లు ఖర్చు చేస్తున్నాం. గత ఏడాది 110 రకాల రంగురంగుల చీరలు అందిస్తే, ఈసారి 287 రకాల చీరలు ఇస్తున్నాం. బంగారు, వెండి, జరీ అంచులతో మంచి డిజైన్ల కొంగులతో మంచి మంచి బతుకమ్మ చీరలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 13లక్షల, 23వేల చీరలను పంపిణీ చేస్తున్నాం. పాలకుర్తి నియోజకవర్గంలో 1 లక్షా 4వేల, 745 చీరలను అందిస్తున్నాం” అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu