కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రముఖ సంస్థలన్నీ ఉద్యోగులకు “వర్క్ ఫ్రమ్ హోమ్” కు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిగ్గజ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వలన ప్రస్తుతం ఇంటివద్ద నుంచే పనిచేస్తున్న తమ ఉద్యోగులకు తర్వాత కూడా ఇంటి నుండే శాశ్వతంగా పని చేయడానికి అనుమతి ఇవ్వాలని మైక్రోసాఫ్ట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కోరుకున్న ఉద్యోగులకు మాత్రమే శాశ్వతంగా ఇంటి నుంచే పని చేసే సౌలభ్యాన్ని కల్పించనున్నారు. అలాగే అన్ని విభాగాల ఉద్యోగులకు శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం వర్తించదని పేర్కొన్నారు.
ఇంటి నుంచి పనిచేయాలని కోరుకునే ఉద్యోగులు ఆయా విభాగాల మేనేజర్లతో చర్చించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు ఇప్పటికే తమ సంస్థలోని ఉద్యోగుల్లో చాలామందికి ఇంటి నుండి శాశ్వతంగా పని చేయడానికి ట్విట్టర్ సంస్థ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ తర్వాత మైక్రోసాఫ్ట్ కూడా శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ కు వెసులుబాటు ఇవ్వగా, మరికొన్ని కీలక సంస్థలు కూడా ఆ దిశగా అడుగులేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu