తెలంగాణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కమ్యూనిస్ట్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శి పదవికి ఖమ్మం జిల్లాకు చెందిన కూనంనేని సాంబశివరావు, నల్గొండ జిల్లాకు చెందిన నేత పల్లా వెంకట్ రెడ్డిలు పోటీ పడగా.. పార్టీలోని ఎక్కువమంది సాంబశివరావుకు మద్దతుగా నిలిచారు. అయితే రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో నిర్వహించిన సీపీఐ 3వ రాష్ట్ర మహాసభల్లో బుధవారం ఈ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా తెలంగాణ ఏర్పడిన తర్వాత సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా సీనియర్ నేత చాడ వెంకట్ రెడ్డి రెండు పర్యాయాలు కొనసాగారు. పార్టీ నియమావళి ప్రకారం మూడు సార్లు కొనసాగే అవకాశమున్న నేపథ్యంలో ఈసారి కూడా ఆయన పదవి ఆశించగా, పార్టీ మాత్రం కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావించింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యదర్శి పదవి కోసం ఈ ఇరువురు నేతలూ ఆసక్తి చూపారు. ఈ క్రమంలో పార్టీలోని నేతలు ఏకాభిప్రాయానికి రావాలని సూచించినా ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఎన్నిక నిర్వహించక తప్పలేదు. ఇక ఓటింగ్లో కూనంనేనికి 59 ఓట్లు రాగా, పల్లా వెంకట్ రెడ్డికి 45 ఓట్లు వచ్చాయి. దీంతో కూనంనేని సాంబశివరావు విజయం సాధించినట్లు పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటన విడుదల చేశాయి. కాగా కూనంనేని సాంబశివరావు ఇంతకుముందు ఉమ్మడి ఏపీ రాష్ట్ర అసెంబ్లీలో కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఒక పర్యాయం, అలాగే సీపీఐ 3వ మహాసభ వరకు రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పార్టీకి సేవలందించారు. అలాగే మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి పల్లా వెంకట్ రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ఇక త్వరలో జరుగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి సిపిఐ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ