తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒకటి చొప్పున బీసీల కోసం కేటాయించిన 33 నూతన గురుకులాలు అక్టోబర్ 11 నుండి, అలాగే నూతన డిగ్రీ కళాశాలలను కూడా అక్టోబర్ 15 నుండి ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఈ అంశంపై మంత్రి గంగుల కమలాకర్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బీసీల కోసం ఈ కాలేజీలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారన్నారు. అత్యున్నత స్థాయి ప్రమాణాలతో వీటిని నెలకొల్పుతున్నందున, స్థలాల గుర్తింపు బాధ్యతను స్థానిక జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గతంలో సీఎం కేసీఆర్ హమీనిచ్చిన విధంగా హాలియా, దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్లా, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతీ జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభించాలని, అలాగే ఈ నూతన గురుకులాలతో మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 310కి చేరిందన్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భర్తీ చేస్తున్న 80025 ప్రభుత్వ ఉద్యోగాల కోసం తెలంగాణ బీసీ స్టడీ సర్కిళ్లు మరింత విస్తృతంగా అభ్యర్థులకు సేవలు అందించాలని మంత్రి అధికారులకు సూచించారు. 12 స్టడీ సర్కిళ్లకు అదనంగా, అతి త్వరలో మరో 50 స్టడీ సెంటర్ల ద్వారా గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించాలన్నారు. వీటి ద్వారా దాదాపు 25వేల మందికి పైగా అభ్యర్థులకు నేరుగా లబ్దీ చేకూరుతుందని మంత్రి తెలిపారు.
మరోవైపు ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 41 కులసంఘాలకు కోకాపేట, ఉప్పల్ బగాయత్లో వేల కోట్ల విలువైన 87.3 ఎకరాల భూమిని కేటాయించిందని, వీటిలో 24 కుల సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవమై పట్టాలు పొందాయని, మిగతా సంఘాల్లో సైతం ఏకగ్రీవాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలా ఏకసంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునే వారికి ఈనెల 8న పట్టాలను ప్రధానం చేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ సొసైటీ సెక్రటరీ మల్లయ్యబట్టు, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు సంద్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY