హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. గణేష్ నిమజ్జనాలతో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలలో కోలాహలం నెలకుంది. భక్తులు గణేశుడిని కీర్తించే నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగుతుంది. మరోవైపు నిమజ్జనాల్లో పాల్గొనే ప్రజలంతా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ సంబరాలు జరుపుకోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం బందోబస్తు కోసం 27 వేల మంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొనగా, ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో వేల సీసీటీవీ కెమెరాలతో పర్యవేక్షణ చేస్తున్నారు.
మరోవైపు ఈ సంవత్సరం ఖైరతాబాద్ లో శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతిగా గణేశుడు భక్తులకు దర్శనం ఇచ్చి, పూజలు అందుకున్న విషయం తెలిసిందే. కాగా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కార్యక్రమం ఆదివారం ఉదయం 8:18 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో నిమజ్జనం పూర్తి అయింది. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర తెలుగుతల్లి ఫ్లై ఓవర్, ఎన్టీఆర్ మార్గ్ మీదుగా ట్యాంక్ బండ్ మీదకు చేరుకొని క్రేన్ నెం.4 దగ్గర నిమజ్జనం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ మార్గ్ కు చేరుకున్న మహాగణపతికి అశేష భక్తజనం కోలాహలం మధ్యలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్రేన్ నెంబర్ 4 వద్ద ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 10 రోజుల పాటు పూజలందుకున్న మహాగణపతికి ప్రభుత్వం ఘనంగా చేసిన ఏర్పాట్లతో ఉత్సవ సమితి సభ్యులు నిమజ్జన కార్యక్రమాన్ని ప్రశాంతంగా పూర్తి చేసారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహాగణపతిని సాగనంపడానికి వచ్చిన భక్తజనంతో హుస్సేన్ సాగర్ పరిసరప్రాంతాలు సందడిగా మారాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా మహాగణపతి నిమజ్జనం పూర్తవడంతో ఉత్సవ సమితి సభ్యులు, అధికారులు, పోలీసులు, భక్తజనం ఆనందం వ్యక్తం చేసారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ