మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఆగస్టు 22, శనివారం నాడు ఎంసీహెచ్ ఆర్డీలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, రైల్వే, ఆర్ అండ్ బి, రెవెన్యూ, విద్యుత్ శాఖ అధికారులతో మనోహరాబాద్ రైల్వే పనుల పురోగతిపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైల్వే పనులు వేగంగా జరగాలంటే శాఖల మధ్య సమన్వయం అవసరమని అన్నారు.
“మనోహరాబాద్ రైల్వే లైన్ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. ఆరు రిజర్వాయర్లు గుండా ఈ లైన్ వెళుతుంది. రైల్వే ద్వారానే రిజర్వాయర్ లో పెంచే చేపలు ఇతర రాష్ట్రాలకు సరఫరా చేయనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఇక్కడ వస్తున్నాయి. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలి. ఈ లైన్ నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువ లేనిదని రైల్వే శాఖ సైతం కితబాచ్చింది. మనోహరాబాద్-గజ్వేల్ మధ్య రైల్వే లైన్ మధ్య జాతీయ రహదాారి పనులు పూర్తి చేయకపోవడం వల్ల వర్షపు నీరు నిలిచి రోడ్ ప్రమాదాలు జరుగుతున్నాయి. జాతీయ రహదారి డ్రైన్ పనులు, పూర్తి కాలేదు. నాచారం గ్రామం బ్రిడ్జి వద్ద అప్రోచ్ రోడ్ సమస్య ఉంది. ఆ రోడ్ పూర్తి చేయాలి. అలాగే నాచారం, ధర్మా రెడ్డి పల్లి, అప్పాయ పల్లి, అప్రోచ్ రోడ్ నిర్మాణం పూర్తిచేయాలి” అని మంత్రి హరీష్ రావు అన్నారు.
“గజ్వేల్ రైల్వే స్టేషను పూర్తయింది. ప్రయోగాత్మకంగా రైలు నడపాలి. గజ్వేల్-దుద్దెడ భూసేకరణ పనులు పూర్తి చేయాలి. జిల్లాకలెక్టర్, రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోని భూసేకరణ పనులు పూర్తి చేయాలి. రైల్వే పనులు జరిగే చోట విద్యుత్ లైన్లు మార్చాల్సి వస్తే ఆ పనులను విద్యుత్ శాఖ అధికారులతో చర్చించి వేగవంతంగా పూర్తిచేయాలి. ఈ నెలాఖరులోగా రైల్వే లైన్ కు సంబంధించిన భూసేకరణ పనులు పూర్తి చేయాలి. గజ్వేల్-దుద్దెడ లైన్ లో 28 కిలోమీటర్లకు గాను 5 కిలోమీటర్ల పని ఇంకా చేయాల్సి ఉంది. సిద్దిపేట రైల్వేస్టేషన్ పనులు ప్రారంభించాలి. ఇందుకు అవసరమైన ప్రణాళికలు తయారు చేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులు ప్రభుత్వం ఇస్తుంది. రైల్వే అధికారులు ఉదారంగా కేంద్ర నుంచి వచ్చే వాటా నిధులు మంజూరు చేయాలి” అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu