తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం నాడు నగరంలోని వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో 100 పడకల ప్రత్యేక వార్డు, ఆక్సిజన్ ప్లాంట్ మరియు 12 పడకల ఐసీయూ వార్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కరోనా మూడో వేవ్ సన్నద్ధతలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఆసుపత్రుల్లో మరో 1400 బెడ్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నిలోఫర్ ఆసుపత్రిలో 800 పడకలు ఏర్పాటు చేస్తున్నామని, మరో 6 ఆసుపత్రుల్లో 100 పడకలు చొప్పున ఏర్పాటు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే నేడు వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో వంద పడకల ప్రత్యేక వార్డును ప్రారంభించామని తెలిపారు. ఈ ఆసుపత్రిలో ఆధునాతన ఎక్స్-రే మెషిన్ ను కూడా త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు.
పేదల వైద్యం మీద దేశంలో అతిఎక్కువుగా ఖర్చుపెడుతున్న రాష్ట్రం తెలంగాణనే:
ఇక కరోనా మూడో వేవ్ నేపథ్యంలో ప్రభుత్వంతో సహకరించాలని ప్రజలకు మంత్రి పిలుపునిచ్చారు. మాస్కులు ధరించడం, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు పాటించాలని సూచించారు. మూడో వేవ్ పై ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. 21 లక్షలు హోమ్ ఐసోలేషన్ కిట్లను అందుబాటులో ఉంచుకున్నామని, ఆక్సిజన్ కెపాసిటీని మూడింతలు పెంచుకున్నామని చెప్పారు. ఈ మధ్యనే కేంద్రప్రభుత్వం వెల్లడించిన గణాంకాల్లో పేదల వైద్యం మీద ఈ దేశంలో అతిఎక్కువుగా ఖర్చుపెడుతున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని చెప్పడం జరిగిందన్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను కూడా ఇంకా బాగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇక బస్తీ దవాఖానలు దేశానికి ఆదర్శమని, నగరంలో అవసరం ఆధారంగా మరిన్ని బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో కూడా బస్తీ దవాఖానలు ప్రారంభించనున్నామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ