తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై ఒక ప్రత్యేక నివేదికను సమర్పించినట్లు సమాచారం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో.. హైదరాబాద్ నగరంలో ఒక వర్గం ప్రజల నుంచి పెద్ద ఎత్తున జరుగుతున్న నిరసనలపై తమిళిసై వివరించినట్లు తెలుస్తోంది. దీనితోపాటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణల క్రమంలో.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం తదితర పరిణామాలపై కూడా అమిత్ షాతో చర్చించినట్లు సమాచారం. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై ఆమె హోంమంత్రికి సవివరంగా వివరించినట్లు తెలుస్తోంది.
అయితే సుమారు 40 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో హోంమంత్రి, గవర్నర్కు పలు కీలక సూచనలిచ్చినట్లు సమాచారం. రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు తమకు నివేదికలు పంపించాలని సూచించిన అమిత్ షా, అవసరాన్ని బట్టి కేంద్ర బలగాల సహాయాన్ని అందించటానికి కూడా సిద్ధమని గవర్నర్ తమిళిసైకి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక అమిత్ షాతో భేటీకి ముందుగా గవర్నర్ తమిళిసై నూతనంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కలిశారు. ఉపరాష్ట్రపతికి అభినందనలు తెలిపడంతో పాటుగా రాష్ట్రంలోని రాజకీయ అంశాలపై చర్చించారు. అలాగే గవర్నర్ చివరిగా ఒక మీడియా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నారీ శక్తి’ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY