సిద్ధిపేట జిల్లా చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేసి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలువలకు నీళ్లు వదిలిన ఈ కార్యక్రమంలో మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, రసమయి బాలకిషన్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అంతకు ముందుగా మల్లన సాగర్ ప్రాజెక్ట్ టన్నెల్ నాలుగవ గేట్ ఎత్తి నీళ్లు ఇరిగేషన్ ఈఎన్సీ హరిరామ్ నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, ఇవాళ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటి విడుదల చేయడం మరుపు రాని రోజని పేర్కొన్నారు. ఈ రోజు కోసం తరతరాలుగా రైతులు ఎదురు చూపులు చూశారని, ఈ రోజు కల, నిజమా అన్నట్లుగా ఉందన్నారు. కాలువల వెంట బిరబిరా గోదారమ్మ పరిగెడుతుంటే, రైతుల కళ్లల్లో ఆనంద భాష్పాలు కారుతున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, ఇంజనీర్లకు, కార్మికులకు ధన్యవాదాలు. ఇంత కాలం రైతులు, కరెంట్, కాలం మీద ఆధారపడి వ్యవసాయం చేశారు. ఇక నుంచి కరెంట్, కాలంతో నిమిత్తం లేకుండా రెండు పంటలు పండించే రోజులు వచ్చాయి. ఒకనాడు ఈ ప్రాంతంలో కాలం అయితేనే రైతులది కడుపు నిండేది. ఒకనాడు ఇక్కడి రైతుల పరిస్థితి అప్పులతో ఆత్మహత్య చేసుకునే వారు. ఇక నుంచి ఆత్మహత్యలకు పుల్ స్టాఫ్ పెట్టి, కరువు అనే పదాన్ని డిక్షనరీ నుంచి తీసేస్తాం. 365 రోజుల పాటు రంగనాయక సాగరుకు నీళ్లు వస్తాయి కాబట్టి కరువుకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతున్నాం.
కాలిపోయిన మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లపై రైతులు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేవారు.. ఇక నుంచి రైతులు ఖచ్చితంగా రెండు పంటలు పండించుకునే శుభదినం నేడు ప్రారంభమైందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రధాన కుడి కాలువ ద్వారా 40వేల ఎకరాలకు, ఎడమ కాలువ ద్వారా 70 వేల ఎకరాలు సాగునీరు అందుతున్నది. ప్రాథమికంగా చెరువులు, చెక్ డ్యామ్, కుంటలు, వాగులు, వంకలు వేసవి కాలంలోనే నింపుతాం. సిద్ధిపేట వాగు కింద 28 చెక్ డ్యామ్ లు శనిగరం చెరువును కూడా పెద్ద మొత్తంలో నింపుతాం. నక్కవాగు, పెద్దవాగు కింద ఉండే చెక్ డ్యామ్ లు నింపుతాం. మైనర్, సబ్ మైనర్ కాలువల తవ్వకాలకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. వర్షాకాలం వరకు పిల్ల కాలువలు పూర్తి చేసుకోవాలి. కాలువలు తవ్వడానికి ఇదే సరైన సమయమని మంత్రి పేర్కొన్నారు.
కాల్వల్లో దూకి ఈత కొట్టిన ఏంపీ కొత్త, ఎమ్మెల్యే రసమయి, ప్రజాప్రతినిధులు:
ప్రధాన ఎడమ కాలువలో గోదావరి జలాలు ప్రవహిస్తుండటంతో సంబురంతో కాల్వ జలాలు ఏంపీ, ఎమ్మెల్యేలపై చల్లుతూ మంత్రి హరీశ్ రావు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చిన్నకోడూర్, నారాయణరావు పేట మండల ప్రజాప్రతినిధులు సంబురంతో కాలువల్లో దూకి ఈత కొట్టారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, స్థానికులతో మంత్రి హరీశ్ రావు సెల్ఫీలు దిగి కాలువల్లోకి నీళ్లు విడుదలైన సంబురాన్ని పంచుకున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu