తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ పేరును ‘భారత్ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్) గా కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఈసీ ఆమోదం తెలపడంపై తెలంగాణ వైద్యారోగ్య, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు. నాడు స్వరాష్ట్ర ఆకాంక్ష, నేడు స్వదేశ స్వావలంబన అని పేర్కొన్నారు.
“కేసీఆర్ సారథ్యంలో నాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి ప్రజా పోరాటాలతో స్వరాష్ట్ర గమ్యాన్ని చేరింది. నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన పార్టీగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడింది. స్వరాష్ట్రం కోసం తన ప్రాణాన్ని ఫణంగా పెట్టిన కేసీఆర్,ప్రజల ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి అనతి కాలంలోనే తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపారు. అభివృద్ధి, సంక్షేమంలో, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ లు దేశానికి రోల్ మోడల్, ఆదర్శమని తెలంగాణను ఎన్నోసార్లు అభినందించారు” అని మంత్రి అన్నారు.
“స్వరాష్ట్రంలో అద్భుతమైన విజయాలు సాధించినట్లుగానే దేశాన్ని కూడా అదే మార్గంలో తీసుకెళ్లాలి, దేశంలో మార్పు తేవాలని సీఎం కేసీఆర్ తలపెట్టిన మహా యజ్ఞము ఇది. జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ గత అక్టోబర్లో విజయ దశమి పర్వదినాన ప్రకటించారు. నేడు అధికారికంగా కేంద్ర ఎన్నికల సంఘం పార్టీ పేరు మార్పును దృవీకరించడం సంతోషకరం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి స్పూర్తితో రాబోయే రోజుల్లో దేశంలో మార్పు కోరుకుందాం. దేశ ప్రజలు స్వావలంబన సాధించేలా అడుగేద్దాం” అని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE