హైదరాబాద్ నగరంలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిలో మే 1 వ తేది నుండి వైద్య సంబంధ అత్యవసర పరిస్థితులకు టెలి-కన్సల్టేషన్ సదుపాయాన్ని అందించనున్నారు. ముఖ్యంగా వైద్య అవసరాల కోసం ఎక్కువ దూరం నుంచి వచ్చే వారికి ఉచితంగా అందించే ఈ సేవలు ఉపయోగపడనున్నాయని తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్డౌన్ నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రికొచ్చే అవుట్ పేషెంట్ల సంఖ్య 2500 నుంచి 300 కి తగ్గిపోయిందని, ఈ సమయంలో టెలీ-కన్సల్టెన్సీ సౌకర్యం ద్వారా ఎక్కువ మంది వైద్య సేవలను పొందే వీలు కలుగుతుందని చెప్పారు.
ముందుగా పరిమిత అపాయింట్మెంట్స్ తో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, కార్డియాలజీ, మెడికల్ ఆంకాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ మరియు రుమటాలజీ వంటి ఏడు విభాగాలలో టెలి-కన్సల్టేషన్ సేవలు ప్రారంభమవుతాయని, ఆ తర్వాత ఇతర విభాగాలకు ఈ సేవలు విస్తరిస్తామని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఎన్. సత్యనారాయణ తెలిపారు. నిమ్స్ హెచ్ఎంఐఎస్ యాప్ ద్వారా లేదా నిమ్స్ వెబ్ పోర్టల్ (ttps: //www.nims.edu.in) లేదా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య 040-23489244 నంబర్ కి ఫోన్ చేసి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడం ద్వారా ఈ సేవలు పొందవచ్చని చెప్పారు.
వైద్యులను సంప్రదించడానికి కనీసం ఒక రోజు ముందు స్లాట్ బుక్ చేసుకోవాలని, స్లాట్ రిజర్వు అయిన తర్వాత సంప్రదించిన వారి యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు మెసేజ్ ద్వారా నిర్ధారణ పంపబడుతుందని చెప్పారు. స్లాట్ బుక్ చేసుకున్న వారు, వారికీ కేటాయించిన సమయంలో ఫోన్ ను పక్కనే ఉంచుకోవాలని చెప్పారు. అపాయింట్మెంట్ ను బట్టి సంబంధిత విభాగాల వైద్యులు ఉదయం 9.30 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు కాల్ చేస్తారని, ఆ సమయంలో వైద్యుల కాల్స్ కు సమాధానం ఇవ్వకపోతే, తిరిగి మళ్ళీ అందుబాటు ఉన్న సమయంలో అపాయింట్మెంట్ తీసుకోవాలని నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu