మాండుస్ తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 6 గంటలలో మాండుస్ తుఫాన్ తీవ్రమైన తుఫానుగా కొనసాగి, తర్వాత క్రమంగా బలహీనపడి తుఫానుగా మారనుందని చెప్పారు. ఇది చెన్నైకి దక్షిణ-ఆగ్నేయంగా 320 కి.మీ దూరంలో ఉందన్నారు.ఇక ఈ తుఫాన్ పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను పుదుచ్చేరి మరియు శ్రీహరికోట మధ్య మహాబలిపురం వద్ద డిసెంబర్ 10, శనివారం అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము సమయంలో తీరాన్ని తాకవచ్చని తెలిపారు. తుఫాన్ తీరం దాటే సమయంలో 65-85 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. ఈ మాండుస్ తుపాను ప్రభావంతో ఈ శుక్ర, శని వారాల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా ఏపీలో శుక్రవారం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే శనివారం చిత్తూరు మరియు అనంతపురం జిల్లాల్లోని ఐసోలేటెడ్ ప్రదేశాలలో మరియు వైఎస్ఆర్ జిల్లా మరియు ప్రకాశం జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా మాండుస్ తుపాన్ పై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించి, అప్రమత్తంగా ఉండాలని వివిధ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. తుఫాన్ తీవ్రత, ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటూ తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మాండుస్ తుపాన్ ప్రభావం అధికంగా ఉన్న నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగించాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. మరోవైపు మాండూస్ తుఫాను నేపథ్యం లో శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ యం.హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE