మాజీ మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ తనతో పాటు మంత్రి హరీశ్ రావు కూడా పార్టీలో అవమానం ఎదుర్కొన్నారంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈటల చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. ఈటల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తి చేయడం తన విధి, బాధ్యతని అన్నారు. సీఎం కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదని, తనకు గురువు, మార్గదర్శి, తండ్రితో సమానులని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నానని, గతంలో కూడా అనేక సార్లు ఇదే విషయం సుస్పష్టంగా చెప్పానని తెలిపారు. కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటానని అన్నారు.
తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఈటల రాజేందర్ వైఖరి ఉందని హరీశ్ రావు అన్నారు. పార్టీని వీడడానికి ఈటలకు అనేక కారణాలుండొచ్చని, పార్టీలో ఉండాలా, వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టమని అన్నారు. అయితే తన భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాక వికారమైన ప్రయత్నం అన్నారు. ఈటల పార్టీని వీడినా టీఆర్ఎస్ పార్టీకి నష్టం ఉండదని, ఆయన పార్టీకి చేసిన సేవకన్నా, పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువన్నారు. ఇక తన సమస్యలకు, తన గొడవకు నైతిక బలం కోసం ఈటల పదేపదే తన పేరును ప్రస్తావించడం ఆయన భావదారిద్య్రానికి నిదర్శనమని, ఆయన తనపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ