పుట్టిన గడ్డకు సేవలందించేందుకు ముందుకు రావాలని విదేశాల్లో స్థిరపడిన వైద్యులకు పిలుపునిచ్చారు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. శనివారం ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ మరియు నిలోఫర్ ఆస్పత్రుల్లో పసి పిల్లలకు గుండె ఆపరేషన్స్ నిర్వహించిన డాక్టర్ రమణ నేతృత్వంలోని బ్రిటన్ వైద్య బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో నిమ్స్ ఆస్పత్రిలో యూకే వైద్యులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఈ సందర్భంగా ఒక్కో సర్జరీని దాదాపు 20 మందితో కూడిన వైద్య బృందం 4-5 గంటల పాటు శ్రమించి చేశారని, తద్వారా 9 మంది పసిపిల్లల ప్రాణాలు కాపాడారని తెలిపారు. దీనిలో భాగమైన నిమ్స్ ఇంచార్జి డైరెక్టర్ బీరప్పకు, నిలోఫర్ సూపరింటెండెంట్ ఉషారాణికి, సర్జరీలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మంత్రి శుభాకాంక్షలు చెప్పారు.
డాక్టర్ రమణ లండన్లో పేరెన్నికగన్న వైద్యుడని, ప్రజలకు సేవ చేయాలనే తపనతో తమను సంప్రదించారని తెలిపారు. డాక్టర్ రమణ బృందం ఇక్కడి వైద్య సిబ్బందికి మంచి శిక్షణ అందించిందని, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న 9 మంది చిన్నారులకు నిమ్స్ ఆస్పత్రిలో ఆపరేషన్లు చేశారని మంత్రి వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సలు అన్నీ విజయవంతమయ్యాయని, గతంలో ఇలాంటి శస్త్రచికిత్సలు కేవలం ఢిల్లీలోని ఎయిమ్స్లో మాత్రమే జరిగాయని మంత్రి చెప్పారు. కాగా ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 100 మందిలో ఒకరు గుండె సంబంధిత సమస్యలతో పడుతున్నారని మంత్రి హరీశ్ రావు తెలియజేశారు. ఇక తెలంగాణలో ప్రతి సంవత్సరం 6 లక్షల మంది శిశువులు పుడుతున్నారని, వారిలో దాదాపు 6000 మంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని మంత్రి చెప్పారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. వారిలో కనీసం 1000 మందికి శస్త్రచికిత్సలు అవసరమని, ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని వైద్య సిబ్బందిని సాంకేతికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పరిమితులు మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో శస్త్రచికిత్సలు చేయడానికి తగినంత డబ్బు లేకపోవడం వల్ల, పేద కుటుంబాల నుండి చాలా మంది శిశువులు మరణిస్తున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. ఇక నిధుల కొరతను పరిష్కరించడానికి, ప్రభుత్వం నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) నిధులు మరియు పరికరాల సహాయంతో, ఐసియు, ఆపరేషన్ థియేటర్ మరియు ఇతర సౌకర్యాలతో కూడిన కార్డియోథొరాసిక్ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు హరీశ్ రావు వెల్లడించారు.
6 వేల కోట్లతో రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, దీనిలో భాగంగా అలాగే వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 24 అంతస్తుల భవనాన్ని ఈ ఏడాది చివరి నాటికి సిద్ధం చేసి, దసరా నాడు ప్రారంభిస్తామని తెలిపారు. అలాగే నిమ్స్ ఆసుపత్రిని మరో 2000 పడకలతో విస్తరిస్తామని, దీనితో పాటు గాంధీ ఆస్పత్రిలో కొత్త బ్లాకులను కూడా నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఇక రాష్ట్రంలోని మెడికల్ సీట్ల గురించి హరీశ్ రావు వివరిస్తూ.. లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో ఎంబీబీఎస్ సీట్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని అన్నారు. రాష్ట్రంలో 1 లక్ష జనాభాకు 7 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయని, ఇది దేశంలో రెండవ అత్యధికమని, ముందుముందు ఈ సంఖ్యను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి హరీశ్ రావు తెలియజేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE