బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన బీజేపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, అయితే కొన్ని సాధించడంలో మాత్రం సక్సెస్ అయిందని పేర్కొన్నారు. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ను చూస్తుంటే ఒక నిర్దిష్టమైన దశ దిశ లేవని తెలుస్తోందని, ఆర్థిక సర్వేలకు, వాస్తవ పరిస్థితులకు దూరంగా ఇది ఉందని తెలిపారు. ఈ ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం బడ్జెట్లో చెప్పేది ఒకటి, ఆచరణలో చేసేది మరొకటి అని ఆయన మండిపడ్డారు. ప్రధాని మోదీ మొదటి బడ్జెట్ సందర్భంగా చెప్పిన మాట ‘సబ్ కా సాత్.. సబ్ కా వికాస్’, అలాగే రెండో బడ్జెట్లో నల్లధనం తెచ్చి, ప్రజల ఖాతాల్లో వేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు ప్రజల జన్ధన్ ఖాతాల్లో ఒక్క పైసా కూడా డిపాజిట్ కాలేదని మంత్రి గుర్తుచేశారు.
ఆ తర్వాత మూడో బడ్జెట్లో రైతులకే తొలి ప్రాధాన్యం అని ప్రకటించారని, కానీ వారికి వ్యతిరేకంగా 2020లో మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని హరీష్ రావు తెలిపారు. దీంతో దేశంలోని రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, దిక్కుతోచక ఆందోళన చెందిన రైతులు 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వెల్లడించారు. ఇలా ప్రతి బడ్జెట్లో ఎదో ఒక వర్గానికి అనుకూలంగా మాటలు చెప్పడం, ఆ తర్వాత ఆచరణలో మాత్రం శూన్య హస్తం చూపించడం బీజేపీకి పరిపాటిగా మారిందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీకి తెలిసింది ఒక్కటేనని, దేశ ప్రజలను మభ్యపెట్టడం అని ఆయన వ్యాఖ్యానించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, అర్హులైన వాందరికి ఇళ్ళు, నదుల అనుసంధానం, సెస్సుల రూపంలో ఇష్టారీతిన పన్నులు వేయడం, ఇంధన మరియు సిలిండర్ ధరలు పెంచడం, ప్రతిపక్షాలపై ఈడీ, సీబీఐ దాడులు చేయించడం, ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం, దేశ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి విషయాలలో మాత్రం బీజేపీ సక్సెస్ అయిందని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE