ఆగస్టు నెలలో కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డులు అందించనున్నామని ప్రకటించారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఆయన కొల్లాపూర్ నియోజకవర్గంలో రూ. 170 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగింస్తూ.. కరోనా మహమ్మారితో పాటు మరికొన్ని ఇతర సమస్యల కారణంగా గత మూడేళ్లుగా కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయామని, అయితే వచ్చే నెలలో రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ కొత్తగా పెన్షన్లు, రేషన్ కార్డులు జారీ చేయనున్నామని హామీ ఇచ్చారు.
రాష్ట్రం విడిపోకముందు రూ. 200గా ఉన్న పెన్షన్ను పది రెట్లు పెంచి రూ. 2016 ఇస్తున్నామని, ఆనాడు 29 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చేవారని, అయితే ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ల సంఖ్య 40 లక్షలని తెలిపారు. గత ప్రభుత్వాలు పెన్షన్ల కోసం బడ్జెట్ లో కేవలం రూ. 800 కోట్లు కేటాయించేవారని, కానీ తెలంగాణ ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వెల్లడించారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం, సాగునీటి కోసం ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని, అయితే కొత్తగా నిర్మించుకుంటున్న కొల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గోపాల్ దిన్నె రిజర్వాయర్ నుంచి సుమారు 25 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నామని పేర్కొన్నారు.
ఇక పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు, తెలంగాణకు మధ్య కొల్లాపూర్ ఒక జంక్షన్గా ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. సీఎం కేసీఆర్, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ పాలన సాగిస్తున్నారని, దీనివల్లే నేడు తెలంగాణ దేశంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటోందని, దీనివలన దేశంలోని యువత అయోమయానికి గురవుతున్నారని మండిపడ్డారు. దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్, బీజేపీల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వాళ్ళ మాయమాటలను నమ్మి మోసపోవద్దని మంత్రి కేటీఆర్ ప్రజలకు సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ