తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే బుక్ చేసుకున్న స్లాట్లకు సంబంధించి తేదీ మరియు సమయం ఆధారంగా రిజిస్ట్రేషన్లు కొనసాగుతాయని తెలిపింది. ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాల దృష్ట్యా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.
డిసెంబర్ 21 నుంచి పాతపద్ధతిలోనే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు:
మరోవైపు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా ముందస్తు స్లాట్ బుకింగ్ తో సంబంధం లేకుండా డిసెంబర్ 21, సోమవారం నుండి అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో వ్యవసాయేతర ఆస్తుల నమోదును ప్రస్తుతానికి పాతపద్దతైనా కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (కార్డ్) వ్యవస్థను ఉపయోగించి చేపట్టాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకొని రిజిస్ట్రేషన్లు సజావుగా మరియు వేగవంతంగా జరిగేలా చూడడంతో పాటుగా తగిన విధానాలను అనుసరించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల అధికారులను ఆదేశించినట్టు సీఎస్ సోమేశ్ కుమార్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ