తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం నాడు ట్యాంక్బండ్ వద్ద మొబైల్ ఐసీయూ బస్సులను ప్రారంభించారు. వెరాస్మార్ట్ హెల్త్ కేర్ సహకారంతో లార్డ్స్ చర్చి ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ముందుగా లార్డ్స్ చర్చి, వెరాస్మార్ట్ హెల్త్ కేర్ బృందాలకు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి దశలో రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభిస్తుండగా, రెండో దశలో మరో 33 బస్సులు తీసుకురానున్నారని చెప్పారు. తద్వారా రాష్ట్రంలో జిల్లాకు రెండు మొబైల్ ఐసీయూ బస్సులు చొప్పున అందుబాటులోకి వస్తాయన్నారు.
ఈ బస్సుల ద్వారా మారుమూల ప్రాంతాలకు సేవలు అందుతాయని, ఒక్కో మొబైల్ ఐసీయూ బస్సులో 10 బెడ్లు, ఆక్సిజన్ కాన్సెన్ట్రేటర్స్, ఒక డాక్టర్, ఇద్దరు నర్సులు, టెక్నీషియన్, సిసి టివి మరియు ఇతర సదుపాయాలు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ కరోనా మహమ్మారితో హెల్త్ కేర్ సిబ్బంది గొప్పతనం ఏంటో ప్రపంచానికి మరోసారి తెలిసివచ్చిందని, వీరిని ప్రజలు దేవుడితో సమానంగా చూస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎస్ సోమేశ్ కుమార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు సాయన్న, ముఠా గోపాల్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ