తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం మాదాపూర్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో హైదరాబాద్ ఈ-మొబిలిటీ వీక్లో భాగంగా ఏర్పాటు చేసిన ‘హైదరాబాద్ ఈ-మోటార్ షో 2023’ని ప్రారంభించారు. రాబోయే సంవత్సరాల్లో, ఆటోమొబైల్ కంపెనీలు తమ తదుపరి తరం ఈవీ మోడళ్లను విడుదల చేయడానికి మరియు ప్రదర్శించడానికి ఈ-మోటార్ షో ఒక మార్గదర్శక వేదికగా ఉద్భవిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సిట్రోయెన్ ఇండియా యొక్క ఈసీ3 ఆల్ ఎలక్ట్రిక్ కారు, హాప్ ఎలక్ట్రిక్ యొక్క ఓక్సో, క్వాటంమ్ ఈవీ ఇండియా యొక్క ప్లాస్మా వాహనాలను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, ఈవీ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, భారతదేశాన్ని ఎలక్ట్రిక్ మొబిలిటీకి మార్చడంలో కీలక పాత్ర పోషించాలని తెలంగాణ లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు దాని సప్లై చైన్ కేంద్రంగా అభివృద్ధి చెందడానికి భారతదేశం బాగా సిద్ధమైందని నమ్ముతున్నానని అన్నారు. అలాగే సుస్థిరత, క్లీన్ ఎనర్జీని అవలంబించడంలో తెలంగాణ అగ్రగామిగా ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రగతిశీల ఈవీ అడాప్సన్ పాలసీతో పాటుగా 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా సామర్థ్యంతో తెలంగాణ దేశంలోనే మొబిలిటీలో ‘ఎలక్ట్రిఫైడ్’ స్టేట్గా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సెల్ మాన్యుఫ్యాక్చరింగ్, సెల్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు, 2-వీలర్, 3-వీలర్, బస్సుల్లో ఈవీ తయారీ వంటి ఎకో సిస్టమ్ లోని వివిధ భాగాల తయారీని తీసుకురావడానికి తెలంగాణ సమగ్ర వ్యూహాన్ని అనుసరిస్తోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాగా హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మూడు రోజుల పాటుగా జరిగే హైదరాబాద్ ఈ-మోటార్ షో 2023లో అపోలో, హ్యుందాయ్, మహీంద్రా, సిట్రోయెన్, టీవీఎస్, ఓలా, ఎంజీ మోటార్, జెడ్ఎఫ్, ఈటీఓ మోటార్స్, అమర రాజా, స్విచ్ మొబిలిటీ, పియాజియో వంటి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు పాల్గొననున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE