హైదరాబాద్ మహానగరానికి తాగునీటి కొరత రానీయకుండా, నీటి సరఫరా విషయంలో శాశ్వత పరిష్కారంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని సుంకిశాల వద్ద రూ.1453 కోట్లతో వ్యయంతో హైదరాబాద్ జలమండలి భారీ ఇన్టెక్ వెల్ నిర్మిస్తుంది. ఈ సుంకిశాల ఇన్టెక్ వెల్ పనులకు శనివారం ఉదయం రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, సీహెచ్ మల్లా రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, జలమండలి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల ప్రజలకు ఇది ఒక శుభదినమని పేర్కొన్నారు. దేశంలో వేగంగా ఎదుగుతున్న మహానగరం హైదరాబాద్ అని, వచ్చే 15 సంవత్సరాల కాలంలో ఢిల్లీ తర్వాత రెండవ అతిపెద్డ మహానగరంగా హైదరాబాద్ ఆవిర్భవిస్తుందన్నారు. హైదరాబాద్ దేశానికి ఒక సంపద వంటిదని, నాలుగువైపులా సహజసిద్డమైన అనుకూలతలు ఉన్నాయన్నారు. తన చిన్నతనంలో ఖైరతాబాద్ జలమండలి వద్ద ఖాళీ బిందెలు, కుండలు ఉండేవనన్నారు. గత ఏడేళ్లల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రస్తుతం మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ఆధ్వర్యంలో రూ.6 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులు నడుస్తున్నాయన్నారు.
ప్రస్తుత 2022లో హైదరాబాద్లో నీటి అవసరాలు 37 టీఎంసీలు కాగా, రాబోయే 50 ఏళ్ల వరకు అంటే 2072 వరకు ఆలోచిస్తే ఇది పెరిగి మరో 33-34 టీఎంసీల అవసరం ఉంటుందన్నారు. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుంటే 2072 నాటికీ దాదాపు 71 టీఎంసీల నీరు అవసరం ఉండే అవకాశం ఉందని తెలిపారు. 2035 నాటికి 47.6 టీఎంసీలు, 2050 నాటికి 58.98 టీఎంసీలు, 2065 నాటికి 67.71 టీఎంసీలు, 2072 నాటికి 70.97 టీఎంసీల త్రాగునీరు అవసరం ఉంటుందని అంచనా వేశామన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ త్రాగునీటి, పరిశ్రమల అవసరాలు కోసం సుంకిశాలలో 1450 కోట్ల అంచనా వ్యయంతో పంపులు, మోటార్లతో పాటు అదనంగా 16 టీంఎసీలు లిఫ్ట్ చేయడానికి పనులు ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో ఇన్టెక్ టన్నెల్స్, పంప్ హౌజ్ లు, పైప్ లైన్స్, సబ్ స్టేషన్ సహా ఎన్నో ఉన్నాయన్నారు. రాబోయే ఎండాకాలం కల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలను శాశ్వతంగా తీరుస్తూమని చెప్పారు. అలాగే భవిష్యత్ లో కృష్ణా ఫేజ్-4, ఫేజ్-5 కు సంబంధించిన నేపధ్యాన్ని కూడా ఇప్పుడే సిద్ధం చేసుకుంటున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF