తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ రోజు ఢిల్లీలోని నిర్మల్ భవన్ లో కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలు మరియు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరీతో భేటీ అయ్యారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధికి సంబంధించిన అంశాలను కేంద్ర మంత్రితో కేటిఆర్ చర్చించారు. కేంద్రం నుంచి తెలంగాణ పురపాలక శాఖకు రావాల్సిన బకాయిలు రూ.2,537.82 కోట్లు విడుదల చేయాలని కోరారు. పిఎంఎవై (అర్బన్) కింద రూ.1184.8 కోట్ల నిధులు, స్వచ్ఛభారత్ అర్బన్ కింద రూ.217కోట్లు, అమృత్ ప్రాజెక్ట్ కింద రూ.351 కోట్లు, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ కింద రూ.783 కోట్లు రావాల్సి ఉందని, ఆ నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, కార్పొరేషన్స్ లలో ప్రాథమిక సౌకర్యాలైన ప్రజా మరుగుదొడ్లు, డంప్ యార్డ్, మురుగునీటి శుద్ధి కర్మాగారాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను కేటిఆర్ కేంద్ర మంత్రికి వివరించారు. అలాగే ఉడాన్ పథకం కింద వరంగల్ విమానాశ్రయ పనులను వేగవంతం చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రతిపాదిత విమానాశ్రయాల సర్వే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలనీ కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఛైర్మన్ వినోద్ కుమార్, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ కూడా పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu