స్వాతంత్య్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామ రాజుని గుర్తుచేసుకోవడం భారతీయ పౌరుడి విధి అని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. ఈరోజు సీతారామా రాజు 125వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్పై నిర్వహించిన వేడులకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని, అల్లూరిని గుర్తు చేసుకోవడం ప్రతి పౌరుడి బాధ్యతని తెలిపారు. అందుకే అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
ఇంకా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ లోని ఖానామెట్లో అల్లూరి భవన నిర్మాణం కోసం మూడెకరాల భూమిని సీఎం కేసీఆర్ కేటాయించారని తెలియజేశారు. తెలంగాణలో ‘జల్.. జంగిల్.. జమీన్’ నినాదంతో గోండు వీరుడు కుమ్రం భీమ్ పోరాడారని, అలాగే ఆంధ్రా ప్రాంతంలో అల్లూరి పోరాటాన్ని చేశారని గుర్తుచేశారు. ఇలాంటి గొప్ప వీరుల స్ఫూర్తితో ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాసరే సీఎం కేసీఆర్ పట్టుదలతో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు.. తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్తో పాటు మరికొందరు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ