టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన మంగళవారం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకంపై పార్టీ శ్రేణులుకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. దళిత బంధుపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని, ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని బలంగా తిప్పికొట్టాలని నాయకులకు సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు చిరస్థాయిగా ఉంటాయని, ప్రజల అభిమానంతో రాష్ట్రంలో మరో ఇరవై ఏళ్ల పాటుగా టీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మరోవైపు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం అనంతరం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
సెప్టెంబర్ 2న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో తెలంగాణ భవన్ కు భూమి పూజ:
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశంలో పలు అంశాలకు సంబంధించి సమగ్రమైన చర్చ జరిగిందని చెప్పారు. సెప్టెంబర్ 2వ తేదీన సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఢిల్లీలో 1200 చదరపు మీటర్ల స్థలంలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ (తెలంగాణ భవన్) కు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కమిటీ సభ్యులందరూ హాజరవుతారని చెప్పారు. అదేవిధంగా సెప్టెంబర్ 2వ తేదీనే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ కమిటీల నిర్మాణం, వార్డు కమిటీ నిర్మాణ ప్రక్రియ కూడా ప్రారంభం అవుతుందన్నారు. మండలస్థాయి, మున్సిపల్, పట్టణ, జిల్లా కమిటీలు కూడా సెప్టెంబర్ నెలలోనే ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం సెప్టెంబర్ నెలలోనే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు.
జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను విజయదశమికి ప్రారంభిస్తామని చెప్పారు. వచ్చే నవంబర్ లేదా అక్టోబర్ నెలలో పార్టీ ద్విదశాబ్ది ఉత్సవ సభ నిర్వహిస్తామని తెలిపారు. ఇక దళితబంధు పథకాన్ని రాష్ట్ర కమిటీ సభ్యులు విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మరోవైపు ఈ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రస్తావన రాలేదన్నారు. హుజురాబాద్ చిన్న ఉపఎన్నిక అని, అక్కడ పరిణామాలతో ప్రభుత్వానికి, పార్టీకి వచ్చే ఇబ్బంది ఏమి లేదన్నారు. హుజురాబాద్ మొదటినుంచి కూడా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని చెప్పారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తరువాత హుజురాబాద్ ఎన్నిక గురించి చర్చ జరుపుతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ