ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సచివాలయంతో పాటు హెచ్ఓడీ కార్యాలయాలు, జిల్లా కలెక్టర్ల కార్యాలయాలు, ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు బయో మెట్రిక్ హాజరు నమోదును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. గతంలోనే సచివాలయంతో పాటుగా ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు కొనసాగగా, కరోనా వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో గతేడాది మార్చి నుంచి ఆ విధానాన్ని నిలుపుదల చేశారు. తాజాగా కరోనా పరిస్థితులు మెరుగవడంతో ఇటీవల జరిగిన కార్యదర్శుల సమావేశంలో ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును మళ్ళీ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో బయోమెట్రిక్ హాజరు పరికరాలు సరిగ్గా పనిచేసేలా సిద్ధం చేయాలని ఐటీ శాఖకు సీఎస్ ఆదేశాలు ఇచ్చారు. ఇక అన్ని శాఖల కార్యదర్శులు, కలెక్టర్లు, ప్రభుత్వ కార్యాలయాల అధిపతులు ఎప్పటికప్పుడు ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరును పరిశీలించాలని, నెలవారీగా హాజరు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాలని సూచించారు. ఉద్యోగుల బయోమెట్రిక్ హాజరుపై తక్షణమే చర్యలు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ