తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న దళిత బంధు పథకం దళితులు ఆర్ధికంగా అభివృద్ధి సాధించేందుకు దోహదపడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో దళితబందు పథకం అమలు జరుగుతున్న తీరుపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆర్ధికంగా అభివృద్ధిలో ఎంతో వెనుకబడిన దళితులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించేలా దళిత బంధు పథకాన్ని చేపట్టిందని అన్నారు. ఈ కార్యక్రమం అమలులో భాగంగా మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 100 మంది చొప్పున ఒకొక్కరికి 10 లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు.
హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాలలో 1476 మంది దరఖాస్తు చేసుకోగా, 1462 మంది ఖాతాలలో 10 లక్షల రూపాయలు చొప్పున నిధులు జమ చేసినట్లు వివరించారు. వీరిలో 1200 మంది లబ్దిదారులకు వారు కోరుకొన్న యూనిట్ లను అందజేయడం జరిగిందని చెప్పారు. యూనిట్ లను పొందిన లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. మిగిలిన లబ్దిదారులకు ఈ నెలాఖరు లోగా యూనిట్ లను సంబంధిత ఎమ్మెల్యేల సహకారంతో అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లబ్దిదారులకు అందజేసిన యూనిట్ లను సక్రమంగా వినియోగించుకొనే విధంగా అవసరమైన సహకారం అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. డిమాండ్ ఉన్న రంగాలను లబ్దిదారులు ఎంపిక చేసుకొనే విధంగా అధికారులు అవగాహన కల్పించాలని చెప్పారు.
దళితబందు క్రింద ఎంపికై ఆర్ధిక సహాయం పొందిన లబ్దిదారులకు ప్రభుత్వ పరంగా మరింత చేయూతను అందించేందుకు ఉన్న అవకాశాలను గుర్తించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇప్పటి వరకు యూనిట్ లను పొందిన వారి వివరాలు, యూనిట్ ప్రస్తుత పనితీరు, సాధించిన ఫలితాలు తదితర వివరాలతో ఫోటో, వీడియోగ్రఫీని సేకరించి నివేదిక రూపంలో ఈ నెల 20 వ తేదీలోగా అందజేయాలని మంత్రి ఆదేశించారు. ఎంతో గొప్ప లక్ష్యంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం అమలులో ఎలాంటి విమర్శలకు, పిర్యాధులకు అవకాశం లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమలు చేయాలని చెప్పారు. అర్హులైన దళితులు అందరికి దశల వారిగా దళితబంధు క్రింద ఆర్ధిక సహాయం అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశంలో జీహెఛ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ప్రభాకర్ రావు, స్టీఫెన్ సన్, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాద్, సాయన్న, ముఠా గోపాల్, జాఫర్ హుస్సేన్, పాషా ఖాద్రి, కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY