బీజేపీ పార్టీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం తుక్కు గూడాలో నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. “అమిత్ షా జీ తెలంగాణకు స్వాగతం. రూ.3000 కోట్లకు పైగా ఫైనాన్స్ కమీషన్ గ్రాంట్ల బకాయిలు, రూ.1350 కోట్ల బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్, రూ.2247 కోట్లు జీఎస్టీ పరిహారంను కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు క్లియర్ చేస్తుందో దయచేసి తెలంగాణ ప్రజలకు చెప్పండి” అని ఆమె ప్రశ్నించారు.
అలాగే ఆకాశాన్ని తాకుతున్న ద్రవ్యోల్బణం, దేశంలో నిరుద్యోగం, బీజేపీ ఆధ్వర్యంలో గరిష్ట మతపరమైన అల్లర్లు, అత్యంత ఖరీదైన ఇంధనం మరియు ఎల్పీజీ విక్రయించడంలో అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిగా నిలవడం” వంటి అంశాలపై అమిత్ షా సమాధానం ఏంటని ఆమె ప్రశ్నించారు. గత 8 సంవత్సరాలలో తెలంగాణకు ఒక్క ఐఐటీ, ఐఐఎం, ఐఐఎస్ఈఆర్, ఐఐఐటీ, ఎన్ఐడీ, మెడికల్ కాలేజీ లేదా నవోదయ పాఠశాలలు ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందో నేడు తెలంగాణ ప్రజలను కలిసినప్పుడు వారికి చెప్పాలని కోరారు. హర్ ఘర్ జల్ అనే ప్రతిష్టాత్మకమైన కేంద్ర ప్రభుత్వ పథకానికి స్ఫూర్తినిచ్చిన మిషన్ కాకతీయ మరియు మిషన్ భగీరథకు రూ.24,000 కోట్ల నిధులను అందించాలని నీతి ఆయోగ్ చేసిన సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఎందుకు విస్మరించిందని అడిగారు. కర్నాటకలోని ఎగువ భద్ర ప్రాజెక్ట్, కెన్ బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్ట్ హోదాను కల్పించి, తెలంగాణలోని పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరియు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం జాతీయ హోదాను తిరస్కరించడం కేంద్ర ప్రభుత్వ కపటత్వం కాదా? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF