మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. ఉపఎన్నిక సన్నద్ధతలో భాగంగా నేడు (ఆగస్టు 20, శనివారం) మునుగోడు మండల కేంద్రంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ముఖ్య అతిధిగా పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సభ కోసం మంత్రి జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. 25 ఎకరాల్లో లక్ష మందికి పైగా కూర్చునేలా ఏర్పాట్లు జరిగాయి. మునుగోడు ఉపఎన్నికను టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ సభకు భారీగా జనసమీకరణ చేస్తున్నారు. మునుగోడులో గులాబీ జెండా ఎగరేసేలా ప్రజాదీవెన సభకు టీఆర్ఎస్ నాయకులు సర్వం సిద్ధం చేశారు. . ఉపఎన్నికకు ఇంకా షెడ్యూల్ రావాల్సి ఉండడంతో సీఎం కేసీఆర్ మునుగోడు నియోజకవర్గానికి ఈ సభ నుంచే హామీల వర్షం కురిపించే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారు. మరోవైపు ఈ సభలోనే ఉప ఎన్నికల్లో పోటీ చేసే పార్టీ అభ్యర్థిని కూడా సీఎం కేసీఆర్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది.
సీఎం కేసీఆర్ ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు మునుగోడు ప్రజా దీవెన సభ వేదికకు చేరుకొని ప్రసంగించనున్నారు. ప్రగతి భవన్ నుంచి ఉప్పల్, ఎల్బీనగర్, పెద్ద అంబర్ పెట్, పోచంపల్లి క్రాస్ రోడ్స్, చౌటుప్పల్, నారాయణ్ పూర్, ఛల్కేడ మీదుగా వేల కార్లతో కూడిన భారీ కాన్వాయ్తో సీఎం కేసీఆర్ మునుగోడు చేరుకోనున్నారు. సీఎం కేసీఆర్ రోడ్డుమార్గంలో మునుగోడు వెళ్తుండడంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ విషయంలో ప్రజలకు పోలీసులు ఆదేశాలు ఇచ్చి, ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా సహకరించాలని విజ్ఞప్తిచేశారు. అలాగే ఈ సభ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు ఈ సభా నుంచే సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించనుండడంతో, సీఎం ఏం మాట్లాడనున్నారనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY