సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శనివారం ఉదయం విజయవాడలో సిటీ సివిల్ కోర్టు ప్రాంగణంలో నిర్మించిన బహుళ అంతస్థుల (జీ+7) కోర్టు భవనాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
ముందుగా శనివారం ఉదయం జస్టిస్ ఎన్వీ రమణ హైదరాబాద్ నుంచి గన్నవరంకు, అక్కడి నుంచి విజయవాడ కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. అనంతరం ఏపీ హైకోర్టు సీజే, సీఎం వైఎస్ జగన్ తో కలిసి కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఆతర్వాత ఏపీ హైకోర్టు సీజే, సీఎం వైఎస్ జగన్ లతో కలిసి జస్టిస్ ఎన్వీ రమణ నూతన భవన సముదాయాన్ని ప్రారంభించారు. 29 ఏసీ కోర్టుల హాళ్లు, వేర్వేరు వెయిటింగ్ హాళ్లు, క్యాంటీన్, లిఫ్టులు సహా అన్ని అధునాతన సదుపాయాలతో నూతన కోర్టు భవనాలను నిర్మించారు. మరోవైపు విజయవాడ నోవోటెల్ హోటల్లో జస్టిస్ ఎన్వీ రమణను సీఎం వైఎస్ జగన్ దంపతులు మర్యాద పూర్వకంగా కలిశారు. దాదాపు 20 నిమిషాల పాటు వారి భేటీ సాగినట్టు తెలుస్తుంది. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు పార్టీ నేతలు కూడా జస్టిస్ ఎన్వీ రమణను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఇక ఈ కార్యక్రమం అనంతరం సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి చేరుకొని ఏఎన్యూ స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొంటారు, అలాగే ఏఎన్యూ యూనివర్సిటీ ప్రదానం చేసే డాక్టరేట్ను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ స్వీకరిరించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పాల్గొననున్నారు. అనంతరం మంగళగిరి సీకే కన్వెన్షన్ లో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విందులో సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY