తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు నియోజకవర్గం ఉపఎన్నిక నేపథ్యంలో పోలింగ్ సరళిపై ఆరా తీశారు. హైదరాబాద్ నుంచి మునుగోడు స్థానిక నేతలతో పోలింగ్ జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పలు కీలక సూచనలు చేశారు. ఏమాత్రం అజాగ్రత్త తగదని, పోలింగ్ పూర్తయ్యే వరకూ అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ నేతలకు సూచించారు. అలాగే పలు మండలాల్లోని కీలక నేతలకు స్వయంగా ఫోన్ చేసి వారి పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితులపై సమాచారం అడిగి తెలుసుకుంటున్నారు. కాగా దీనికిముందు నిన్న అర్ధరాత్రి అయన మునుగోడుకు బయలుదేరగా పోలీసులు అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొందరు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు మునుగోడులో ఉన్నారని, అయినా ఈసీ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ బండి సంజయ్ బుధవారం అర్ధరాత్రి దాటాక కారులో మునుగోడు బయలుదేరారు.
అయితే ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులను తప్పించుకుని ముందుకు సాగిన బండి సంజయ్ను అబ్దుల్లాపూర్మెట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ఆయనను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించి కొద్దిసేపటి తర్వాత వదిలిపెట్టారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి మంత్రులు, స్థానికేతర ఎమ్మెల్యేలు, అధికార టిఆర్ఎస్ పార్టీ నాయకులు మునుగోడులోనే వుండి ప్రజలను భయభ్రాంతులకు, ప్రలోభాలకు గురి చేస్తున్నారని, దీనిపై పదే పదే హెచ్చరించినా పోలీస్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల నియమావళికి లోబడి నిరసన తెలుపుదామని బయలుదేరిన మమ్మల్ని అబ్దుల్లాపూర్మెట్ వద్ద బలవంతంగా అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని బండి సంజయ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE