తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు బుధవారం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నేడు శాసనసభ, శాసన మండలి ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ చేపట్టారు. ఇక దీని తర్వాత రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వం తరపున సమాధానం ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో శాసనసభలో ఈరోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. కాగా బుధవారం ఉదయం సమావేశాలు ప్రారంభమైన వెంటనే తొలుత మాజీ శాసనసభ్యులు వెలిచాల జగపతి రావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రుద్రమ దేవి తదితరుల మృతిపట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో సభ్యులు సభలో నుంచుని రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు.
ఇక ఈ సందర్భంగా శాసనసభలో బడ్జెట్పై చర్చను ప్రారంభించిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. రూ.2.90 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి హరీశ్ రావుకు అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, అయితే కేంద్రం మాత్రం న్యాయంగా రాష్ట్రాలకు దక్కాల్సిన నిధులను అందించడం లేదని, విభజన చట్టం ప్రకారం కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడం లేదని అన్నారు. ఆ తర్వాత అధికార పార్టీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఈ ఎనిమిదేళ్లలో అభివృద్ధి పరంగా, సంక్షేమ పరంగా తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని, అన్నదాతల కోసం రైతుబంధు పథకం, ఎస్సీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం దళితబంధు, ఇంటింటికీ నల్లా ద్వారా ప్రజలందరికీ మంచినీళ్లు, కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, వృద్దుల కోసం కంటివెలుగు, పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో మారిన గ్రామీణ, పట్టణ ప్రాంతాల రూపురేఖలు, అద్భుతమైన ప్రగతి సాధిస్తున్న ఐటీ రంగం వంటివి సీఎం కేసీఆర్ పాలనాదక్షతకు నిదర్శమని, చరిత్రలో వంటి కార్యక్రమాలతో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE