నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ పక్రియ కొనసాగుతుంది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 346 కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3 గంటల వరకు 69.0 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలంగాణ చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయెల్ వెల్లడించారు.
–> నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా, సాయంత్రం ఏడు గంటలకు ముగియనుంది. మొత్తం 346 పోలింగ్ కేంద్రాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి, కరోనా నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. ఈ ఉపఎన్నికలో 2,20,300 మంది ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కాగా ఉదయం 9 గంటల వరకు 12.9% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
–> నాగార్జునసాగర్ పోరులో 41 మంది బరిలో నిలిచినప్పటికీ, ముఖ్యంగా ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్యే త్రిముఖ పోరు నెలకుంది. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్ కుమార్, కాంగ్రెస్ తరపున సీనియర్ నాయకుడు జానారెడ్డి, బీజేపీ అభ్యర్థిగా పానుగోతు రవికుమార్ ఈ ఉపఎన్నికల్లో బరిలో నిలిచి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. మూడు పార్టీల కీలక నేతలు కూడా పెద్దఎత్తున ప్రచారం నిర్వహించడంతో ఈ ఉపఎన్నికలో ఎవరు విజయం సాధిస్తారనే ఆసక్తి రాష్ట్ర ప్రజల్లో నెలకుంది. ఇక మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితం వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ