తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం నాడు హాలియాలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఎదురు చూస్తున్నా నిరుపేదలుకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. అర్హులుగా ఉన్నటువంటి పెన్షన్ లబ్దిదారులకు కొత్త పింఛన్లు మంజూరు చేసే పక్రియ కూడా త్వరలోనే చేపడతామని చెప్పారు. వేరుబడ్డ వారికీ, ఇతరత్రా కారణాల వలన అవసరం పడిన వారికీ ప్రతి గ్రామంలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.
నల్గొండలో లిఫ్టులు పూర్తిచేసి అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం:
నల్గొండ జిల్లా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నెల్లికల్లు, బారకత్ గూడెం, ముక్త్యాల బ్రాంచ్ కెనాల్, జాన్పహాడ్ బ్రాంచ్ కెనాల్, కంబాలపల్లి సహా పలు ఎత్తిపోతల పథకాలకు (లిఫ్ట్ ఇరిగేషన్) శంకుస్థాపన చేసినట్టు చెప్పారు. వాటన్నింటికి సుమారు 2500 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తున్నామన్నారు. ఈ ఎత్తిపోతల పథకాలను ఒకటిన్నర సంవత్సరంలోపు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని, జిల్లా ప్రజాప్రతినిధులతో పాటుగా తాను కూడా పనులపై పర్యవేక్షణ చేస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. అలాగే వీరుల పాలెం, తోపుచర్ల లిఫ్టులు కూడా మంజూరు చేస్తామన్నారు. ఈ లిఫ్టులు అన్నింటిని పూర్తిచేసి అందించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగం అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు సహకరించి ఒకటిన్నర సంవత్సరంలోపే పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు.
అలాగే కృష్ణా నదిలో నీరు రానప్పుడు వాడుకునే విధంగా, గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టు ద్వారా పాలేరుకు, అక్కడినుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్ తీసుకొచ్చి నల్గొండ జిల్లా సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరేలా చేస్తామని చెప్పారు. అందుకోసం రూ.600 కోట్లతో అంచనాలు సిద్దమయ్యాయని, త్వరలోనే వాటిని మంజూరు చేస్తానని ప్రకటించారు. అదేవిధంగా త్వరలో జిల్లాల్లో పర్యటించి గిరిజనుల పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ