విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ అనేది రాష్ట్ర ప్రజల మనోభావాలు, ఎమోషన్స్ తో కూడుకున్న అంశంగా, ప్రత్యేకంగా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మిగిలిన పరిశ్రమలతో పోలిస్తే విశాఖ ఉక్కు కర్మాగారం ఏ విధంగా ప్రత్యేకమైనదో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు వివరించి, ఈ కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని కోరామన్నారు. పవన్ కళ్యాణ్ మూడు రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
ఈ పర్యటనలో రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతల పరిస్థితులు, ఆలయాలపై దాడులు, ఆర్ధిక పరిస్థితులు, నివర్ తుపాను మూలంగా రాష్ట్ర రైతాంగం ఏ విధంగా నష్టపోయారు అనే అంశాలను అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. ప్రధానంగా విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచనపై చర్చించారు. కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్, కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో చర్చలు జరిపారు. ఈ సందర్భంలో పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. ఈ పర్యటనలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ గారు మీడియాతో మాట్లాడుతూ “విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై అమిత్ షాతో చర్చించాం. 18 వేల మంది నేరుగా ఉపాధి తీసుకుంటూ ఉన్నారు. 20 వేల మందిపైగా కాంట్రాక్టు లేబర్ ఉన్నారు. లక్ష పైచిలుకు దీని మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని పునరాలోచన చేయాలని కోరడం జరిగింది. మావంతుగా ఏమేమి చేయాలో తెలియచేశాం. ప్రత్యేక పరిస్థితుల్లో దాదాపు 32 మంది బలిదానాల తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది. దీన్ని కేవలం ఉక్కు కర్మాగారంగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకు మనోభావాలు, ఆత్మ గౌరవానికి ప్రతీకగా భావించి సూక్ష్మంగా చూడాలన్న అంశాన్ని కూడా నాయకులందరి దృష్టికి తీసుకువెళ్లాం. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ను కూడా కలవడం జరిగింది. ఆయనతో చర్చ సందర్భంగా కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని ప్రస్తావించాం. ఈ అంశంతో పాటు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో వివరించాం. దేవాలయాలపై దాడులు సాగుతున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావించాం” అని చెప్పారు.
తిరుపతి ఉపఎన్నికపై వచ్చే నెల 3,4 తేదీల్లో అమిత్ షా తిరుపతి పర్యటనలో చర్చించాక స్పష్టత:
“జనసేన-బీజేపీల రూట్ మ్యాప్ ఎలా ఉండాలి. ఎన్నికల వరకూ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశం మీద కోర్ కమిటీలో చర్చిద్దామని అమిత్ షా తెలిపారు. శాంతి భద్రతల మీద చాలా దృష్టి ఉంది. వీటన్నింటి మీద లోతుగా మాట్లాడేందుకు వచ్చే నెలలో దానిపై చర్చిస్తాం. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ రాత్రికి రాత్రి ఆయన తీసుకున్న నిర్ణయం కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ధిక సంస్కరణల్లో భాగంగా జరుగుతోంది. కానీ ఇప్పుడు ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పునరాలోచించమని చెప్పాం. ఈ అంశంపై వైసీపీ మనస్ఫూర్తిగా పని చేయాలి అనుకుంటే సాధ్యపడుతుంది. వారు చేయకూడదు అనుకుంటే మనమేం చేయలేం. ఇంత దూరం మేము వచ్చి కలిసి కేంద్రానికి విజ్ఞాపన ఇచ్చినప్పుడు 22 మంది ఎంపిలు ఉన్న వైసీపీ చాలా చేయొచ్చు. తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కూడా వచ్చే నెల 3, 4 తేదీల్లో అమిత్ షా గారి తిరుపతి పర్యటనలో చర్చించాక స్పష్టమైన రోడ్ మ్యాప్ వస్తుంది” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ