తెలంగాణలో భారతీయ జనతా పార్టీ జోరు మూడు నెలల్లో తారుమారు అయిపోయింది. కేసీఆర్ సర్కారును కూలగొడుతుందా అనే సందేహాలు తలెత్తే స్థితి నుంచి కనీసం పది సీట్లయినా సాధిస్తుందా అనే స్థితికి చేరుకుంది. ఇటీవల ఏ సర్వే విడుదలైనప్పటికీ.. అందులో బీజేపీకి పది మాత్రమే కనిపిస్తున్నాయి. బండి సంజయ్ హయాంలో టాప్ గేర్ లో దూసుకెళ్లిన బీజేపీ.. మూడు నెలలో బ్రేకులు ఫెయిలైన బండిలా మారిపోయింది. కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా అయిన తర్వాతే పార్టీకి ఈ పరిస్థితి తలెత్తిందని కేడర్ లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటే గెలిచినప్పటికీ లోక్సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు సాధించింది. అలాగే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అధికారంలోకి వస్తుందన్న ఊపు తెచ్చింది. కానీ.. పార్టీ తన బలాన్ని ఎక్కువ కాలం కాపాడుకోలేకపోయింది. ఈ సారి జరిగే ఎన్నికల్లో అసలు రంగంలోనే లేకుండా పోయింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు బలం ఉన్నప్పటికీ తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో కలిసి పోటీ చేయడం వల్ల ప్రజల తిరస్కరణకు గురైంది. బీజేపీ మొదట ఓబీసీ రాగం అందుకున్నప్పటికీ ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ని అధ్యక్షునిగా తప్పించి కిషన్రెడ్డికి బాధ్యతలు అప్పగించడం వల్ల బీజేపీకి నష్టం చేకూర్చింది.
అయినప్పటికీ టికెట్ ఆశావహులు చాలా మందే దరఖాస్తు చేసుకున్నారు. అయినప్పటికీ వారిలో బీఆర్ ఎస్, కాంగ్రెస్ కు దీటైన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అందుకే జాబితా ప్రకటించేందుకు కూడా బీజేపీ చాలా ఆలస్యం చేసింది. ఎట్టకేలకు 52 మందితో తొలి జాబితా ప్రకటించినప్పటికీ.. పార్టీలో మరిన్ని కష్టలు పెరిగినట్లు కనిపిస్తోంది. అయితే.. అందులో రాజాసింగ్ ను మళ్లీ పార్టీలోకి తీసుకుని గోషామహల్ టికెట్ కేటాయించడం ఊరటనిచ్చే అంశం. కానీ.. కొన్ని చోట్ల ఆ జాబితా నిప్పు రాజేస్తోంది. ప్రధానంగా సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ టికెట్ను వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన రాణి రుద్రమ రెడ్డికి కేటాయించడంపై స్థానిక నేతల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.
సిరిసిల్ల బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్మశాలి నేతకే టికెట్ ఇస్తారని కొద్ది నెలలుగా భావిస్తూ వచ్చారు. తీరా నియోజకవర్గానికి సంబంధంలేని వ్యక్తికి టికెట్ ఖరారు చేయడంపై పద్మశాలీ వర్గీయులతోపాటు బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పద్మశాలీలకు టికెట్ ఇవ్వాలని కోరుతూ, స్థానికేతరులకు టికెట్ ఇవ్వడాన్ని నిరసిస్తూ సిరిసిల్ల అంబేడ్కర్ చౌరస్తా వద్ద సిరిసిల్ల పద్మశాలి సంఘం నాయకులు, ప్రతినిధులు బీజేపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఎనిమిది నెలల క్రితం సిరిసిల్లకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, సెస్ మాజీ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్కు శాసనసభ ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామనే హామీతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్న సమయంలో పార్టీలో చేర్చుకున్నారు. లగిశెట్టి శ్రీనివాస్ నియోజకవర్గంలో ప్రచార సన్నాహాలు చేసుకుంటున్న దశలో, టికెట్ రాకపోవడంతో బీజేపీ వర్గీయులే కాకుండా పద్మశాలీ సామాజిక వర్గంలోనూ ఆగ్రహం వ్యక్తమవుతోంది. బీజేపీ రెబల్ అభ్యర్థిగా లగిశెట్టి శ్రీనివాస్ బరిలో నిలవడానికి సిద్ధమయ్యారు. మొత్తంగా పరిశీలిస్తే ప్రస్తుతం బీఆర్ ఎస్.. కాంగ్రెస్ లకు పోటీ ఇచ్చే స్థితిలో బీజేపీ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ